
జార్ఖండ్, ఆగస్టు 2: జార్ఖండ్ మంత్రి విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ ప్రమాదవశాత్తూ బాత్రూమ్లో జారి పడ్డారు. శనివారం (ఆగస్టు 2) తెల్లవారుజామున తన నివాసంలోని బాత్రూంలో జారీ పడిపోయారు. దీంతో ఆయన తలకు బలమైన గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటీన జంషెడ్పూర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బ్రెయిన్ ఇంజూరీ అయినట్లు గుర్తించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించినట్లు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ తెలిపారు. ప్రస్తుతం మంత్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జార్ఖండ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ మాట్లాడుతూ.. తొలుత సోరెన్ను జంషెడ్పూర్లోని ఆసుపత్రిలో చేర్పించామని, అక్కడ వైద్యులు ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించినట్లు చెప్పారు. అనంతరం సోరెన్ను విమానంలో ఢిల్లీలో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ అపోలో డైరెక్టర్తో తాను స్వయంగా మాట్లాడినట్లు తెలిపారు. మంత్రి ఆసుపత్రికి చేరుకున్న వెంటనే అక్కడ చికిత్స ప్రారంభించినట్లు మంత్రి ఇర్ఫాన్ అన్సారీ తెలిపారు.
అయితే సోరెన్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు జంషెడ్పూర్లోని సోనారి విమానాశ్రయం వద్ద మాజీ కేంద్ర మంత్రి అర్జున్ ముండా విలేకరులకు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
