

విశాఖపట్నం కూర్మన్నపాలెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు వేతన జీవుల ప్రాణాలు బలిగొంది. వేగంగా దూసుకుచ్చిన టిప్పర్ కంట్రోల్ చేయలేక.. టూవీలర్ పైకి దూసుకెళ్లింది. టూ వీలర్ అదుపుతప్పి పక్కనే ఉన్న ఆర్టీసీ బస్సు చక్రాల కిందకు వెళ్ళింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పొట్టకూటి కోసం పనులు చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాలో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలు అందరిని కలచి వేశాయి.
నక్కా కృష్ణ, రాంబాబు అనే ఇద్దరు యువకులు మెడ్ టెక్ జోన్లో కాంక్రీట్ పనులు చేస్తున్నారు. దువ్వాడ సెక్టర్-1 సమీపంలోని కొత్తూరులో నివాసముంటున్నారు. వీరిద్దరూ విధులకు వెళ్లి బైక్పై తిరుగు పయనమయ్యారు. కూర్మన్నపాలెంలోని బస్సు డిపో ఎదురుగా ఉన్న రోడ్డు మీద యూటర్న్ తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అనకాపల్లి నుంచి గాజువాక వైపు వెళ్తున్న టిప్పర్ లారీ వేగంగా దూసుకువచ్చి రెండు బైక్లను ఢీకొట్టింది. ఆ తాకిడికి కృష్ణ, రాంబాబు ప్రయాణిస్తున్న బైక్.. అప్పుడే యూటర్న్ తీసుకుని ముందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందకు వెళ్లిపోయింది.
దీంతో కృష్ణ, రాంబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో బైక్ కూడా కింద పడడంతో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతను సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. టిప్పర్ లారీ వేగమే ఇద్దరి ప్రాణాలు తీసేందుకు కారణమైందని నిర్ధారించారు. కుటుంబాలకు పెద్ద దిక్కయిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోవడంతో.. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..