

ఇవాళ శుక్రవారం (మార్చి 14) ఆకాశంలో హోలీ కనువిందు చేయనుంది. భూమి మీద మనం రంగు పడుద్ది…అంటూ కలర్స్ చల్లుకుంటే.. ఆకాశంలో చందమామ హోలీ జరుపుకోనున్నాడు. మూన్ మూన్ సీన్ అదరగొట్టనుంది. హోలీ నాడు ఒక అద్భుతం చోటు చేసుకోబోతోంది. అదే బ్లడ్ మూన్. ఈ ఏడాది మొదటి గ్రహణం.. ఇవాళే హోలీ రోజున సంభవిస్తోంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. బ్లడ్ మూన్ అని పిలవబడే చంద్రగ్రహణం ఈసారి ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరళరేఖ పై ఉన్న సమయంలో చంద్రుడిపై భూమి నీడ పడడం వలన, దాన్ని పూర్తిగా కప్పేస్తుంది. దీనిని చంద్ర గ్రహణం అంటారు. గ్రహణం సమయంలో చంద్రుడు ఎప్పుడూ కనపడే రంగులోనే ఉంటాడు. కానీ, ఈ బ్లడ్ మూన్ సమయంలో మాత్రం చంద్రుడు పూర్తిగా ఎరుపు లేదా నారింజ రంగులో వచ్చి కనువిందు చేస్తాడు. ఈ గ్రహణం మన దేశంలో ఇవాళ ఉదయం 9.27 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనుంది.
సూర్యుడి నుంచి వచ్చే ఎరుపు లేదా నారింజ కిరణాలు భూమిపై నుంచి ప్రయాణం చేసి చంద్రుడి వర్ణాన్ని మారుస్తాయి. దీనిని రేలీ స్కాటరింగ్ అంటారు. చంద్రగ్రహణం పగటిపూట సంభవిస్తుంది. కాబట్టి ఇది మన దేశంలో కనిపించదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఇది ఒక ఖగోళ వింత మాత్రమేనని, అంతకంటే దీనికి ప్రాముఖ్యత లేదంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే జ్యోతిష్యుల వాదన మరోలా ఉంది. ఇది కేతు గ్రస్త ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణమని, కొన్ని రాశుల వారిమీద దీని ప్రభావం ఉంటుందని వాళ్లు చెబుతున్నారు. ఇది ఇండియాలో కనిపించదు కాబట్టి..ఖగోళ ప్రియులకు కొంత నిరాశ కలిగించడం ఖాయం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..