
మధ్యప్రదేశ్లోని ఇందార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బగోరియా గ్రామంలో స్థానికంగా ఉన్న ఒక ప్రాంతాన్ని శుభ్రం చేస్తోన్న సమయంలో అద్భుతమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు భూమి కింద పాతిపెట్టిన పురాతన విగ్రహాన్ని కనుగొన్నారు. అది విష్ణువు విగ్రహంగా చెబుతున్నారు. ఆ విగ్రహాన్ని బయటకు తీసి.. శుభ్రం చేసి.. గ్రామ ఆలయంలో ప్రతిష్టించారు. దీంతో ఆ విగ్రహాన్ని దర్శించుకునేందుకు స్థానికులు తండోపతండాలుగా వస్తున్నారు.
గ్రామస్థులు రవి శర్మ.. భగీరథ శర్మ, దేవేంద్ర లోధి, చంద్రభాన్ లోధిలతో కలిసి.. ఓ ప్రాంతాన్ని శుభ్రం చేసే క్రమంలో భాగంగా నేలను తవ్వినప్పుడు, దాదాపు అర అడుగు పొడవున్న ఈ విగ్రహం కనిపించింది. దానిని గ్రామ పెద్దలు, పండితులకు చూపించగా దానిని విష్ణువు విగ్రహం అని తెలిపారు.
బగోరియా గ్రామంలో ఒక పురాతన కోట కూడా ఉంది. అది ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఈ దొరికిన విగ్రహం ఆ కోటకు సంబంధించి చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఆస్కారం ఉందంటున్నారు. విగ్రహం ఏ కాలానికి సంబంధించి.. అది దేనితో చేసింది వంటి వివరాలను తెలుసుకునేందుకు పురావస్తు శాఖకు సమాచారం అందించారు.
విగ్రహం దొరికిన తర్వాత గ్రామంలో భక్తిభావంతో కూడిన వాతావరణం నెలకొంది. భక్తులు ఈ విగ్రహాన్ని దైవిక వరంలా భావించి పూజిస్తున్నారు. పురావస్తు శాఖ దర్యాప్తులో ఏ కొత్త విషయాలు బయటపడతాయో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vishu Idol