

చిత్తూరు జిల్లాలో ఒక యువకుడు పుట్టినరోజే మరణించాడు. గంగవరం మండలం కొత్తపల్లి గ్రామ పొలాల్లో వేటగాళ్ళు ఏర్పాటు చేసిన ఉచ్చుకు బలైపోయాడు. విద్యుత్ తీగలు తగిలి యువకుడు ప్రాణాలు వదిలాడు. వన్యప్రాణుల వేట కోసమో లేదంటే పంట పొలాలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకో గానీ.. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి 22 ఏళ్ల కార్తీక్ మృతి చెందాడు. నిన్న రాత్రి స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కార్తీక్ పాడి ఆవు అడవి నుంచి తిరిగి రాలేదని తెలుసుకుని వెతకడానికి వెళ్ళాడు. కార్తీక్తో పాటు నలుగురు స్నేహితులు కొత్తపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్ళారు. రాత్రి పది గంటల సమయంలో చిమ్మచీకట్లో విద్యుత్ షాక్కు గురైన కార్తీక్ కుప్పకూలి పడిపోయాడు. కాపాడబోయిన యుగంధర్ అనే యువకుడికి కూడా ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు కాగా.. సుందరం అనే రైతు పొలంలో ఈ ఘటన జరిగింది. పొలం చుట్టూ వేసిన విద్యుత్ కంచె ప్రమాదానికి కారణం అయ్యింది.
తప్పిపోయిన పాడి ఆవును వెతకడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న కార్తీక్.. ఆ సమయంలో స్నేహితులతో కలిసి ఆవును వెతకడానికే వెళ్లాడా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్, అటవీశాఖ అధికారులు ఈ మేరకు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. కార్తీక్ పుట్టినరోజు నాడు మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అయితే కార్తీక్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్ లైన్ నుంచి పొలం చుట్టూ ఉన్న ఇనుప కంచెకు విద్యుత్ సప్లై ఎలా ఇచ్చారన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. అటవీ ప్రాంతం సరిహద్దులో కొనసాగుతున్న వన్యప్రాణుల వేటపై ఫోకస్ చేసిన అధికారులు కార్తీక్ మృతిపై లోతైన దర్యాప్తు చేపట్టారు.