
హైదరాబాద్, మార్చి 14: తెలంగాణలో వరసగా నియామక పరీక్ష ఫలితాలు వెల్లడిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్.. హోలీ పర్వదినాన గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 1388 పోస్టుల భర్తీ కోసం గత నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వించింది టీజీపీఎస్సీ. దాదాపు 5 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నా.. 2 లక్షల 69 వేలమంది మాత్రమే పరీక్ష హాజరయ్యారు. గ్రూప్ 2 మాదిరిగానే గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లోనూ అబ్బాయిలు సత్తా చాటారు. టాప్ 10లో 9 ర్యాంకులు అబ్బాయిలవే. ఒకే ఒక అమ్మాయి టాప్ 10లో చోటు దక్కించుకుంది. మొత్తం 450 మార్కులకు 3 పేపర్లకు పరీక్ష జరిగింది. ఇందులో 339.239 మార్కులతో ఫస్ట్ ర్యాంక్, 331.299 మార్కులతో సెకండ్ ర్యాంక్, 330.427 మార్కులతో మూడో ర్యాంకు.. వరుసగా ముగ్గురు అబ్బాయిలు సాధించారు. టాప్ టెన్లో ఒకే ఒక్క అమ్మాయి నిలువగా.. ఆమె 325.157 మార్కులతో 8వ స్థానంలో నిలిచింది.
ఇటీవలే గ్రూప్ 1, 2 ఫలితాలు వెల్లడించిన టీజీపీఎస్సీ.. ఫలితాలపై ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. పరీక్ష నిర్వహణ నుంచి వాల్యూయేషన్, ఫలితాల విడుదల వరకు పక్కాగా పారదర్శకంగా జరిపినట్లు తెలిపింది. గ్రూప్ 3 లో జనరల్ ర్యాంకింగ్స్లో ఉన్న అభ్యర్థులను పోస్టుల సంఖ్య ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలవనున్నారు. అది పూర్తైన తర్వాత తుది ఫలితాలు వెల్లడిస్తారు.
మార్చి 20లోపు తమ దగ్గర పెండింగ్ లో ఉన్న అన్ని పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్ష తుది ఫలితాలను వెల్లడించనుంది. ఈ నెల 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ ను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.