
హైదరాబాద్, మార్చి 2: నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం రేవంత్ సర్కార్ మరో అద్భుత పథకాన్ని తీసుకురానున్నారు. సుమారు రూ.6వేల కోట్లతో మార్చి 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదగా పథకం ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి రుణాల మంజూరుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టీ కోరారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశానికి హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి ఈ సందర్భంగా మాట్లాడుతూ…
ప్రపంచ దేశాలను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. అందులో భాగంగానే స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐల ఉన్నతీకరణ, నైపుణ్యమున్న మానవ వనరులు, నిరంతర నాణ్యమైన విద్యుత్తు సరఫరా, చక్కటి శాంతిభద్రతలు, మంచి వాతావరణం కల్పించామన్నారు. దావోస్లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, ప్రాంతీయ రింగ్ రోడ్డు పూర్తయితే రాష్ట్రంలోకి పెట్టుబడులు మరింతగా వెల్లువెత్తుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయా యూనివర్సిటీల పరిశోధకుల సమితి నేతలు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ను కోరారు. ఈ మేరకు హైదరాబాద్లో ఐక్యకార్యాచరణ సమితి నేతలు శ్రీధర్, ఆనంద్, ప్రవీణ్ తదితరులు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మూడు వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రొఫెసర్ల వయోపరిమితి పెంచేందుకు యత్నాలు జరుగుతున్నాయని, ఇది అన్యాయమని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.