
కాంగ్రెస్ ప్రభుత్వం రెండో బడ్జెట్ను ప్రవేశపెడుతోంది.. తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈసారి సుమారు రూ. 3.10 లక్షల కోట్లతో భట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయన్న టాక్ ఆర్ధికశాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూనే.. వ్యవసాయం, ఆరు గ్యారంటీలు, ట్రిపులార్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది… మరీ ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందులోభాగంగానే… బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది..
అంతకు ముందు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయానికి వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి దంపతులు. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతులకు పూజలు చేశారు. ఆ పూజల అనంతరం ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి వచ్చారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.