

మహిళలే వాడి టార్గెట్.. అనారోగ్యంతో ఉంటే నయం చేస్తాను అని మాయమాటలు చెప్పి, మహిళలను లోబర్చుకోవడం వాడికి అలవాటు. మహిళలకు నిద్రమాత్రలు, మత్తుమందు ఇచ్చి.. వారు స్పృహ కోల్పోగానే వారిపై లైంగిక దాడి చేసి, వీడియోలు తీయడం.. తర్వాత వాటిని చూపించి మహిళల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం వాడి దందా. గత కొద్దిరోజులుగా పలు జిల్లాలలో ఇలా చేస్తున్న ఓ దొంగ బాబాను అరెస్ట్ చేశారు మెదక్ పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రాలతో సమస్యలు తొలగిస్తానంటూ మహిళలను లోబరుచుకొని, వారిపై అఘాయిత్యాలకు పాల్పడి.. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న దొంగ స్వామిజిని పట్టుకున్నారు మెదక్ జిల్లా పోలీసులు. జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపుస్వామి అనే వ్యక్తి అనారోగ్యంతో, పలు సమస్యలతో ఉన్న మహిళలను టార్గెట్గా చేసి.. వారికి పలు రకాల మాయమాటలు చెప్పి, కొన్ని పూజలు చేసి సమస్యలు తొలగిస్తానని మహిళలతో పరిచయం పెంచుకొని, వారికి మత్తుపదార్థం ఇచ్చి.. వారిని శారీరకంగా అనుభవించేవాడు. అలా ఉన్న ఆ సమయంలో తన ఫోన్లో వీడియోలు తీసి, వాటిని చూపించి బాధిత మహిళలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవాడు.
ఇలా పలు జిల్లాలలో ఉన్న పలువురు మహిళలు వాడి వలలో చిక్కి మోసపోయారు. వీడి దగ్గరికి పూజల కోసం వచ్చే మహిళలకు, నీటిలో నిద్రమాత్రలు కలిపి వాటిని తాగించేవాడు. ఇలాగే పలు మత్తు మందు పౌడర్లను తాయత్తులకు పెట్టి వాటిని మహిళలు వాసన చూసేలా చేసేవాడు. పలువురు మహిళల ఫిర్యాదు మేరకు వీడి కోసం వేట సాగించిన పోలీసులు.. చివరికి మెదక్ జిల్లాలో పట్టుకున్నారు.
బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న బాపు స్వామిని పట్టుకుని, తమదైన పద్దతిలో పోలీసులు విచారించగా అసలు విషయాలు బయటకు చెప్పాడు. స్వామి వద్ద నుంచి రెండు ఫోన్లు, పలు తాయత్తులు, పలు రకాల పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు. కొండ స్వామి ఫోన్లలో పలువురు మహిళలతో ఉన్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మెదక్ పోలీసులు. ఇలా ఎవరైనా అనుమానస్పదంగా కనబడితే ఆయా పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.