
India A tour of England: ఐపీఎల్ 18వ సీజన్ ప్రయాణం ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ సంవత్సరం మెగా టీ20 లీగ్ ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు చాలా ముఖ్యమైన పర్యటనకు వెళ్లనుంది. జూన్లో టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన ప్రారంభానికి ముందు, భారతదేశపు వర్ధమాన తారలు ఇంగ్లాండ్లో పర్యటిస్తారు.
IPL 2025 తర్వాత ఇంగ్లాండ్లో పర్యటించనున్న ఇండియా-ఏ..
ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత, భారత క్రికెట్లో వర్ధమాన స్టార్ ఇండియా-ఎ జట్టుతో ఇంగ్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఎ జట్టు ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో రెండు 4 రోజుల మ్యాచ్లలో తలపడనుంది. ఇండియా-ఎ , ఇంగ్లాండ్ లయన్స్ మధ్య ఈ మ్యాచ్లు మే 30 నుంచి జూన్ 6 వరకు కాంటర్బరీలోని సెయింట్ లారెన్స్లోని స్పిట్ఫైర్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతాయి.
ఇంగ్లీష్ వేసవి సీజన్లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్లో పర్యటించే ముందు ఇండియా ఎ ఆటగాళ్ళు ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో తలపడతారు. ఈ మ్యాచ్లో రెండు దేశాల నుంచి కొంతమంది వర్ధమాన తారలు ఆడతారు. ప్రధాన పర్యటనకు సన్నాహకంగా కొంతమంది కీలక టెస్ట్ ఆటగాళ్ళు కూడా ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ లయన్స్ చివరిసారిగా స్పిట్ఫైర్ క్రికెట్ గ్రౌండ్లో 2022లో దక్షిణాఫ్రికాతో ఆడింది. ఇందులో ఇంగ్లాండ్ లయన్స్ తరపున ఆడుతున్నప్పుడు హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ వంటి బ్యాట్స్మెన్స్ సెంచరీలు సాధించారు.
స్పిట్ఫైర్ గ్రౌండ్లో మ్యాచ్..
ఇండియా-ఎ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ గురించి కెంట్ క్రికెట్ సీఈఓ సైమన్ స్టోరీ మాట్లాడుతూ, “ఇంగ్లాండ్తో భారత్ పురుషుల టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో స్పిట్ఫైర్ గ్రౌండ్లో భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి మేం ఉత్సాహంగా ఉన్నాం. కాంటర్బరీలో రెండు జట్లకు అంతర్జాతీయ పేర్లు ఉండటంతో ఇది మాకు అద్భుతమైన మ్యాచ్ అవుతుంది. కాంటర్బరీలో గొప్ప అంతర్జాతీయ క్రికెట్ అనుభవాలను సృష్టించడంలో మాకు ట్రాక్ రికార్డ్ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మా మహిళల అంతర్జాతీయ మ్యాచ్ల నుంచి మాకు వచ్చిన అభిప్రాయం దీనికి నిదర్శనం’ అంటూ చెప్పుకొచ్చాడు.
“లండన్ నుంచి కాంటర్బరీ రైలులో కేవలం ఒక గంట ప్రయాణం మాత్రమే. కాబట్టి, రెండు జట్ల అభిమానులు చారిత్రాత్మక స్పిట్ఫైర్ గ్రౌండ్, సెయింట్ లారెన్స్లో ఇంగ్లాండ్ vs ఇండియా ప్రతినిధి మ్యాచ్ను చూడటానికి ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మేం ఆశిస్తున్నాం’ అని తెలిపాడు.