

అంతరిక్షంలో చిక్కుకుని, తొమ్మిదినెలల తర్వాత భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, తాను ధీరవనితనని చాటుకున్నారు. మానవాళికి ఉపయోగడే శాస్త్ర పరిశోధనల కోసం తాను మరో రిస్క్ తీసుకుంటానని అంటున్నారు. అందులో భాగంగానే మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సునీతా విలియమ్స్ రెడీ అయ్యారు. సమస్యలు ఎదుర్కొన్నా వెనుకంజ వేయబోమంటూ ధీమా వ్యక్తం చేశారు. ISSలో మరిన్ని పరిశోధనలు చేస్తామన్నారు సునీతా. భూమ్మీదకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రెస్మీట్ నిర్వహించిన ఆమె.. అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత కోలుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఈనెల 19న అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన రెండువారాల తర్వాత- తొలిసారి మీడియా ముందుకు వచ్చారు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్. 286 రోజులపాటు అంతరిక్షంలో ఉన్న సందర్భంలో తాము ఎదుర్కొన్న అనుభవాలు ఏంటో వారిద్దరూ వివరించారు. మళ్లీ అంతరిక్షంలోకి వెళతారా అన్న విలేకరి ప్రశ్నకు తడుముకోకుండా “యస్” అంటూ సమాధానం చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాము మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు సునీతా విలియమ్స్. తమ ఇబ్బందులకన్నా, మానవళి కోసం పనిచేయడమే తమకు ముఖ్యమన్నారు. ఈ బృహత్తర లక్ష్యం ముందు వ్యోమనౌకలో తలెత్తిన సమస్యలు చాలా చిన్నవనే అర్థం వచ్చేలా మాట్లాడారామ. అంతరిక్షం నుంచి రాగానే, తాను తన కుటుంబాన్ని కలుసుకున్నట్లు సునీతా విలియమ్స్ వివరించారు. భూమ్మీదకు వచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణానికి తాను అలవాటు పడుతన్నట్లు ఆమె వివరించారు.
అంతరిక్షంలో పరిశోధనలు చేస్తూ, తొమ్మిదినెలల పాటు వజ్రసంకల్పంతో అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్, తన తండ్రి మాతృభూమి గురించి అద్భుతంగా అభివర్ణించారు. హిమాలయాలు చూసిన ప్రతీసారి తాము ఎలా అనుభూతి చెందామో వివరించారు. ముంబైతోపాటు, తన తండ్రి స్వరాష్ట్రం గుజరాత్ ఎలా కనిపించేదో వివరించారు. భారత్కు పెట్టనికోట అని పిలుచుకునే హిమాలయాలు పై నుంచి చూస్తే ఇలా ఉంటాయి. సుదీర్ఘమైన మంచుపర్వతాల శ్రేణి, ప్రపంచంలోనే రమణీయంగా ఉంటుంది. ఈ రమణీయతకు ముగ్దులు కానివారి ఉండరు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా హిమాలయ సొగసులను చూసి ఫిదా అయ్యారు.