
దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోరోలు మరికొన్ని రోజుల్లోనే అంతరిక్షం నుంచి భూమికి తిరిగి రానున్నారు. వారి రాక కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. తొమ్మిది నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ను తీసుకురావడానికి అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికీ నాసాతోపాటు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కలిసి చేసిన ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. మొన్ననే ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం కూడా చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే 24 గంటల్లోనే సీన్ మారింది. క్రూ-10 మిషన్ను ప్రయోగిస్తున్నట్లు నాసా, స్పేస్ ఎక్స్ ప్రకటించాయి.
సునీతా విలియమ్స్ ఇక ఊపిరి పీల్చుకో.. తొమ్మిదినెలల తర్వాత, మరికొద్దిరోజుల్లో నువ్వు భూమ్మీదకు రాబోతున్నావ్.. అంటూ నాసా- స్పేస్ ఎక్స్ పేర్కొన్నాయి. శనివారం తెల్లవారుజామున 4.30కి అంతరిక్షంలోకి క్రూ-10 మిషన్ను పంపించనున్నారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ను లాంచ్ చేస్తున్నారు. క్రూ-10లో నాసా, జపాన్, రష్యాకు చెందిన నలుగురు వ్యోమగాములు వెళ్తున్నారు. వారు వెళ్లి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా, విల్మోర్లను తీసుకురానున్నారు. ఈ నెల 20వ తేదీ తర్వాత సునీతా విలియమ్స్ భూమిపై అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.