
అమరావతి, ఏప్రిల్ 23: తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు ఈ ఒక్కరోజే పని చేయనున్నాయి. ఏప్రిల్ 23వ తేదీతో అకడమిక్ ఇయర్ ముగుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రెండు రాష్ట్రాల్లో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయి. తిరిగి పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయి. దాంతో అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 23వ తేదీయే ఈ ఏడాదికి చివరి పని దినంగా ఉండనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ బడులన్నింటికీ ఏప్రిల్24వ తేదీతో తరగతులు ముగుస్తాయి.
మరోవైపు విద్యా సంవత్సరం ముగియడంతో డిప్యుటేషన్లపై పని చేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారం విధుల నుంచి రిలీవ్ అయి చివరి పనిదినమైన ఏప్రిల్ 23న పాత పాఠశాలల్లో చేరాల్సి ఉంటుందని ఇప్పటికే జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా వేసవి ప్రారంభంకావడంతో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో మార్చి 18 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తరహాలోనే ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ముందే ఒంటిపూట బడులు ప్రారంభించింది.
ఏప్రిల్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు వేసవి సెలవులు మొదలవనున్నాయి. ఈసారి విద్యార్ధులకు మొత్తం 50 రోజులు పాటు స్కూళ్లకు వేసవి సెలవులుగా ప్రకటించారు. 2025- 26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అందించేందుకు కొత్త పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. బడులు తెరిచిన తొలి రోజే అంటే జూన్ 12వ తేదీన విద్యార్ధులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ మేరకు దాదాపు నాలుగున్నర కోట్ల పాఠ్య పుస్తకాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.