
కామారెడ్డి, మార్చి 27: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభమవగా ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే టెన్త్ పరీక్షల తొలి రోజే తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు పుట్టించింది. ఇది సర్దమనగక ముందే మరో పేపర్ లీకేజీ ఆరోపణలు వచ్చాయి. తాజాగా మ్యాథమెటిక్స్ పేపర్లోని ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష కేంద్రం నుంచి ఈ ప్రశ్నలు బయటకు వచ్చినట్లు అధికారులు తేల్చారు. బుధవారం (మార్చి 26) జరిగిన గణితం పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను ఓ కాగితంపై రాసి బయటకు పంపారు. ఈ ఇందుకు సంబంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా ప్రశ్నల సమాధానాల చిటీలు కూడా అక్కడ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అందజేసి మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టెన్త్ మ్యాథ్స్ ప్రశ్నల వ్యవహారంపై బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో ఎస్ రాజు, తహసీల్దార్, పంచాయతీ అధికారి, ఎంఈవో, పోలీసులు విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించారు. లీకేజీ వాస్తవమేనని తేలడంతో పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆపీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికలను సస్పెండ్ చేస్తూ డీఈవో బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు కొన్ని పాఠశాల్లో వంద శాతం ఫలితాలు రాబట్టేందుకు కొందరు ఉపాధ్యాయులు కలిసి ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు బయటకు పంపి మాస్ కాపీయింగ్కు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గణితం ప్రశ్నల లీకేజీ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కాగా మాల్ ప్రాక్టీస్, పేపర్ లీకేజీలు చేయొద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా వరుస ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.