
హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (ఎస్ఏ 2) షెడ్యూల్ విడుదలైంది. సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 9 నుంచి 17వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ పూర్తిస్థాయి షెడ్యూల్ను వెల్లడించింది. ఇక ఈ పరీక్షలు పూర్తైన తర్వాత జవాబుపత్రాలను కూడా మూల్యాంకనం చేసి ఫలితాలను మార్చి 23న వెల్లడించాలని విద్యాశాఖ ఆయా పాఠశాలలకు సూచించింది. అనంతరం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి, విద్యార్ధుల ప్రోగ్రెస్ రిపోర్టులు అందజేయాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా రేపట్నుంచి స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 24 వరకు రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే స్కూళ్లు పని చేయనున్నాయి. అనంతరం విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించి ఇళ్లకు పంపించేస్తారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లలో మాత్రం బడులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం5 గంటల వరకు పనిచేస్తాయి.
ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
ఇక తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్).. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పది, ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు టాస్ సంచాలకుడు పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. రాత పరీక్షల అనంతరం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.