
పెద్దన్నను కలిసేందుకు ముప్పై మూడోసారి హస్తినకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి.. అఖిలపక్షంతో వస్తున్నాం సమయం ఇవ్వాలని ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ సోమవారం లేఖ రాశారు.. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర మద్దతు కోరారు. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడింది. పార్లమెంట్ ఆమోదం పొందేలా కలిసి కట్టుగా కృషి చేసేందుకు అఖిలపక్షాలు సంసిద్దమయ్యాయి.
సభలో చెప్పినట్టుగా రేవంత్ సర్కార్ పార్లమెంట్లో బీసీ బిల్లుల ఆమోదం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ ప్రతినిధులతో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు సమయం ఇవ్వాల్సిందిగా ప్రధానికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి.. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను శాసనసభ ఆమోదించిన విషయాలను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి.. సమయం ఇవ్వాలని కోరారు..
తెలంగాణలో ఇప్పుడు విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో , షెడ్యూల్ కులాలు 15 శాతం, షెడ్యూల్ తెగలు 7శాతం, మైనార్టీలు 4 శాతం, BCలకు 23 శాతం రిజర్వేషన్లు వున్నాయి. ఐతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగుణ నివేదిక ప్రకారం బీసీలు 56.36 శాతం . ఆ మేరకు రిజర్వేషన్ల పెంపుఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర మద్దతు కోరనుంది అఖిలపక్షం.. అపాయింట్మెంట్ కోరుతూ పెద్దన్నకు లేఖ వెళ్లింది. ఇక ప్రధాని కార్యాలయం నుంచి పిలుపే తరువాయి అఖిలపక్షం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవనుంది..
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు మరో లేఖ..
ఇదిలాఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు మరో లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును “పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్” గా మార్చాలని కోరుతూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు సీఎం లేఖ రాశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టడంతో.. పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..