

ఫార్మా రంగంలోనే కాదు హెల్త్ సెక్టార్లోనూ తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.. హైదరాబాద్ను హెల్త్ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. పద్మవిభూషణ్ డా.నాగేశ్వరరెడ్డికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే తెలంగాణలో హెల్త్ టూరిజం పాలసీ తీసుకు వస్తామన్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారత రత్న వచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న డాక్టర్ నాగేశ్వర రెడ్డి.. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అందుకోవడానికి అర్హుడని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ను హెల్త్ టూరిజం హబ్గా తీర్చిదిద్దే ప్రణాళిక..
తెలంగాణ ప్రభుత్వం త్వరలో వైద్య పర్యాటక విధానాన్ని ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ను మెడికల్ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ దిశగా, 1000 ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
ఆరోగ్యశ్రీ విస్తరణ – రూ.10 లక్షల వైద్య సేవలు..
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. పథక పరిమితిని రూ.10 లక్షలకు పెంచి, రాష్ట్రంలోని పేదలకు అధునాతన వైద్య సదుపాయాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏటా రూ.900 కోట్లు పేదల వైద్య సేవలకు కేటాయిస్తున్నట్లు వివరించారు.
ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను పునరుద్ధరించాలి..
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పునరుద్ధరణ అత్యవసరమని అభిప్రాయపడ్డారు. డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధితో వైద్యులు రోగులతో మునుపటిలా సమయం గడపలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ప్రత్యేక వైద్యుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ రోగి పూర్తి వైద్య చరిత్రను తెలుసుకోవడంతో చికిత్స మరింత సమర్థవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు.
డిజిటల్ హెల్త్ కార్డులు, మెరుగైన వైద్య సేవలు
రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని సమగ్రంగా పర్యవేక్షించేందుకు ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డులు అందించేందుకు ప్రభుత్వ కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు సీఎం తెలిపారు. ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ ఫార్మాట్లో భద్రపరిచేందుకు ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణమని తెలిపారు. పద్మ విభూషణ్ అవార్డు పొందిన తొలి తెలుగు వైద్యుడు కావడం తనకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణను వైద్య రంగంలో దేశంలోనే ముందున్న రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..