
ప్రధాని మోదీ రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి నేపధ్యంలో జెడ్డా నుంచి బయల్దేరి.. ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రమంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. ఉగ్రవాదుల ఏరివేతపై దిశానిర్దేశం చేయనున్నారు. ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్నాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదేనన్నారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా .
నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా.. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను తరలించడం కష్టమైంది.
కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి తరలివెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్లు సమాచారం. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మోదీ ఆదేశాలతో హుటాహుటిన కశ్మీర్కి చేరుకున్నారు హోం మంత్రి అమిత్షా . భద్రతా దళాల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
కశ్మీర్ చేరిన వెంటనే ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు అమిత్షా. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించారు ప్రధాని మోదీ.. దాడి చేసినవారిని విడిచిపెట్టేది లేదంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ..బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామన్న మోదీ..ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు