
వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కనీస సౌకర్యాలు వాళ్లకు ఆమడ దూరం.. రహదారుల మాట దేవుడు ఎరుగు.. కనీసం కాలికి చెప్పులు కూడా వేసుకోలేని దుస్థితి వారిది. ఎందుకంటే వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పోనీ ఎలాగోలా చెప్పులు కొనుగోలు చేసి వేసుకున్నా.. అక్కడ రోడ్డు సదుపాయం లేక కొండలగుట్టలు దిగే సమయంలో రెండు రోజులకే తెగి మూలన పడిపోతాయి. దీంతో అలాగే నగ్నకాళ్ళతో రాళ్లు రప్పలపై నుంచి కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ ఉంటారు. కాలినడకన ప్రతిరోజు ప్రయాణించడం జీవితంలో వారికి ఒక భాగం అయిపోయింది.
అయితే పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి వెళ్ళగానే.. పాంగి మిత్తు అనే వృద్ధురాలు ఎదురెళ్లి సాదర స్వాగతం పలికింది. ఆమె వెనుక మరింత మంది వెళ్లి దింసా నృత్యాలు డబ్బు వాయిద్యాలతో డిప్యూటీ సీఎం సార్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అదే సమయంలో పాంగి మిత్తుతోపాటు అక్కడ గిరిజన ఆడబిడ్డలు, వృద్ధులు, పిల్లలు ఎటువంటి పాదరక్షలు ధరించకుండా ఉండడాన్ని గమనించారు డిప్యూటీ సీఎం.
కళ్ళరా చూసి.. సర్వే చేయించి.. ఆ సమయంలో అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో పాటు ఎక్కడెక్కడ ముళ్ళు రాళ్ళు ఉండడాన్ని గుర్తించారు. అటువంటి రహదారుల్లో కనీసం కాలికి చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి చలించి పోయారు డిప్యూటీ సీఎం. వారిలో కొందరికి చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా తెలుసుకున్నారు.
దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి ఆ గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారు అని ఆరా తీయించారు. వారందరికీ కాళ్లకు చెప్పులు ఏ సైజు అవసరమో సర్వే చేయించారు.
పది రోజులు పూర్తిగా కాకుండానే.. పెదపాడు గ్రామానికి పాదరక్షలు పంపారు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది బోయిపల్లి పవన్తో పాటు మరి కొంతమంది సభ్యులు ఆ గ్రామానికి వెళ్లారు. స్థానిక సర్పంచ్ వెంకటరావుతో కలిసి.. ప్రతి ఇంటికి వెళ్లి గిరిజనులను పలకరించారు. చెప్పులను పంపిణీ చేశారు.
గ్రామంలో ఉన్న 345 మందికి పాదరక్షలు అందజేశారు. దీంతో ఆ కొత్త చెప్పులు వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు అడవి బిడ్డలు. మా మంచి సారు.. చెప్పులు పంపారు… అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోనూ పదివేల మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అడవి బిడ్డలకు పాదరక్షల పంపిణీ చేయడం పవన్ కళ్యాణ్ దాత గుణానికి నిదర్శనం అనే చర్చ జరుగుతుంది.