
ఎద్దుల్లో ఎన్ని జాతులున్నా ఒంగోలు జాతికి ఉన్న క్రేజ్ వేరు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒంగోలు జాతి ఎద్దులు, ఆవులకు పుట్టినిల్లు గుండ్లకమ్మ పాలేరు నది మధ్యలోని కరవది. ఆ ప్రాంత వాతావరణం, భూమిలోని లవణాలు.. అందులో పండించిన గడ్డి తినడం వల్లే బలిష్టమైన ఒంగోలు జాతి పుట్టుకొచ్చిందని స్థానికులు చెబుతారు. దాదాపు వెయ్యి కేజీలకుపైగా బరువుండే ఒంగోలు గిత్తలు చాలా బలిష్టంగా ఉంటాయి. ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే తత్వం వీటి సొంతం. తెల్లని రంగులో చురుకైన చూపులతో ఆకట్టుకునే ఈ జాతి ఎడ్లు.. కాడి కట్టుకుని ఒకసారి పొలంలోకి దిగాయంటే అలుపెరగకుండా ఐదారెకరాలు దున్నేస్తాయి.
ఒంగోలు గిత్తలు బ్రెజిల్లో అడుపెట్టడం వెనుక పెద్ద కథే ఉంది. 1868లో ఇంగ్లాండ్ కు బయలుదేరిన ఓడలో విక్టోరియా మహారాణి కోసం కొన్ని బహుమతులు పంపారు. వాటిలో రెండు ఒంగోలు జాతి పశువులు కూడా ఉన్నాయి. అయితే ఓడ బ్రెజిల్ తీరానికి చేరుకున్నాక ఆ పశువుల్ని కొందరు స్వార్థపరులు డబ్బు కోసం అక్కడ అమ్మేశారు. అలా బ్రెజిల్ గడ్డపై ఒంగోలు జాతి ప్రస్థానం మొదలైందని 2001లో సెకండ్ ఇంటర్నేషనల్ సిపోసియం ఆన్ ఒంగోల్ క్యాటిల్ సావనీర్లో ప్రస్తావించారు. అలా 150 ఏళ్ల క్రితం బ్రెజిల్ కు చేరుకున్న ఒంగోలు బ్రీడ్ ఆవులు, గిత్తల సంఖ్య ఇప్పుడు కోట్లకు చేరింది. 1962లో భారత ప్రభుత్వం వాటి ఎగుమతులు నిషేధించే వరకు ఒంగోలు జాతి పశువులు బ్రెజిల్ కు తరలిపోతూనే ఉన్నాయి.
బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ జెబు బ్రీడర్స్ లెక్కల ప్రకారం ప్రస్తుతం బ్రెజిల్ పశుసంపద సుమారు 22 కోట్లు. వాటిలో దాదాపు 80శాతం ఒంగోలు జాతి సంతతి పశువులు కావడం విశేషం. ఒంగోలు ఆవు తన జీవితకాలంలో ఆరేడ్లుసార్లు మాత్రమే ఈనుతుంది. దీంతో బ్రెజిలియన్లు ఒంగోలు జాతి ఆవు నుంచి అండం, ఎద్దుల నుంచి వీర్యాన్ని సేకరించి ఆర్టిఫీషియల్గా ఫెర్టిలైజ్ చేసి బ్రెజిల్లోని నేటివ్ బ్రీడ్స్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. ఒంగోలు జాతి సంతతిని అభివృద్ధి చేస్తున్నారు. బ్రెజిల్లో ఒంగోలు జాతి పశువులు అంత ఆదరణ పొందడానికి చాలా కారణాలే ఉన్నాయి. అక్కడి వాతావరణంలో ఒంగోలు జాతి చక్కగా ఇమిడిపోతుంది. ఈ పశువులకు వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ. బ్రెజిల్లో దాదాపు 43 కోట్ల ఎకరాల గడ్డి భూములున్నాయి. అంటే ఒక్కో పశువుకు సగటున రెండు ఎకరాల భూమి ఉండటంతో వాటి పోషణ అక్కడి వారికి సులభంగా మారింది. ప్రస్తుతం అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇండోనేషియా, మారిషస్, కొలంబియా, మలేషియా సహా పలు దేశాలకు ఒంగోలు జాతి విస్తరించింది.
బ్రెజిల్లో వెలుగులీనుతున్న ఒంగోలు జాతి పశువులు సొంతగడ్డపై మాత్రం మనుగడ కోసం పోరాడుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఒంగోలు జాతి పశువుల సంఖ్య 4లక్షలు మాత్రమే. వాటిలో 3లక్షల వరకు ఏపీ, తెలంగాణలో ఉన్నాయి. ఈ 4లక్షల పశువుల్లోనూ మేలుజాతి సంఖ్య కొన్ని వేలు మాత్రమేనని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు ఒంగోలు ప్రాంతంలో ప్రతి ఇంట్లో కాడెడ్ల జత కనిపించేది. వ్యవసాయ పనులకు వాటిని ఉపయోగించేవారు. యాంత్రికీకరణ పెరగడంతో కాడెడ్ల స్థానాన్ని ట్రాక్టర్లు భర్తీ చేశాయి. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు బ్రెజిల్కు ఎక్కువ ఎద్దులను ఎగుమతి చేసిన కరవదిలోనే ఇప్పుడు ఒంగోలు గిత్తలు కనిపించడం లేదు.
1990 తర్వాత వరి, సజ్జ, జొన్న తదితర ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి, పొగాకు, మిరప సాగు పెరిగింది. దీంతో పశువులకు గ్రాసం కరవై వాటి పోషణ ఆర్థిక భారంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పాలు ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో ఒంగోలు జాతి ఆవుల స్థానాన్ని ఎక్కువ పాలిచ్చే గేదెలు ఆక్రమించాయి. 1960లలో అందుబాటులోకి వచ్చిన కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ ఒంగోలు జాతిపై ప్రతికూల ప్రభావం చూపింది. జెర్సీ, హాలిస్టిన్ వంటి విదేశీ జాతులతో క్రాస్ బ్రీడింగ్ చేయడంతో స్వచ్ఛమైన ఒంగోలు జాతి పశువుల సంఖ్య తగ్గిపోయింది.
ఒంగోలు జాతి అత్యంత పురాతనమైనదిగా భావిస్తారు. హరప్పా, మొహంజదారో నాగరికతల్లో కనిపించే మూపురం కలిగిన ఎద్దుల చిత్రాలు ఒంగోలు జాతివేనని అంటారు. శివుని వాహనమైన నంది విగ్రహం కూడా ఒంగోలు జాతికి దగ్గరగా ఉంటుంది. అయితే ఈ పశువుల పుట్టినిల్లు సైబీరియా అని ఆర్యుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఏపీలోని గుండ్లకమ్మ, మూసీ, ఆలేరు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డాయన్న వాదనలు ఉన్నాయి. బ్రిటీషర్ల హయాంలో 1858లో అప్పటి నెల్లూరు కలెక్టర్ తొలిసారి ఒంగోలు జాతి పశు ప్రదర్శన నిర్వహించారు. 1867లో బ్రిటీష్ ప్రభుత్వం ఒంగోలు జాతి పశువుల కోసం ప్రతి గ్రామంలో కొంత భూమిని గ్రాసం కోసం వదలాలని ఆదేశాలు జారీ చేసిందంటే వాటి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.
ఒంగోలు జాతి పశువులు క్రమంగా తగ్గిపోతుండటంతో వాటి పరిరక్షణ కోసం ఆలస్యంగానైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. 1986లో గుంటూరు జిల్లాలో ఒంగోలు జాతి పశు పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ కేంద్రం ఒంగోలు జాతి జన్యు పరిరక్షణకు కృషి చేస్తోంది. పిండమార్పిడి ద్వారా ఎక్కువ దూడలను పుట్టించేలా చర్యలు తీసుకుంటున్నారు. 30 ఏళ్లుగా ఒంగోలు జాతి ఆంబోతుల నుంచి వీర్యాన్ని సేకరించి ఇప్పటి వరకు 5లక్షల డోసులను రైతులకు పంచారు.
ఖరీదైన వ్యవహారం అయినా ఇప్పటికీ ఒంగోలు జాతి గిత్తలను కొని వాటికి శిక్షణ ఇస్తున్నవారు కొందరున్నారు. పోటీల్లో పాల్గొనే గిత్తల ధర ఒక్కొక్కటి 5 నుంచి 20 లక్షలు ఉంటుంది. ఇక వాటి పోషణ, శిక్షణ కోసం నెలకు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతుంది. అయినా ఒంగోలు జాతి పశువులపై ఉన్న ప్రేమతో వాటిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నవారూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ జాతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రజలపైనా ఉంది.