
తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం చేసిందేం లేక.. ప్రజల దృష్టిని మళ్లించడానికి డీలిమిటేషన్పై మీటింగ్ అంటూ కొత్త సమస్యలను లేవనెత్తుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఈ అంశంపై చర్చించేందుకు ఆయన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన పార్టీల నేతలతో ఓ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానాలు పంపారు.
ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందిస్తూ.. స్టాలిన్పై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ 4 సంవత్సరాలలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే భారీ అవినీతి, శాంతిభద్రతలలో భారీ వైఫల్యాలు, పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపుదలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ఈ అంశాలను పక్కదారి పట్టించడం తప్పా ఇంకేం చేయడం లేదని అన్నారు. రూ.1,000 కోట్ల విలువైన లంచాలకు సంబంధించిన పత్రాలను వెలికితీసిన తర్వాత తమిళనాడులో మద్యం సరఫరా చేసే కంపెనీలపై జరుగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడుల నుండి దృష్టిని మళ్లించాలని డీఎంకే డీలిమిటేషన్పై మీటింగ్ పెడుతోందన్నారు.
జాతీయ విద్యా విధానాన్ని మసకబారడానికి డీఎంకే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇటీవలె తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ 2025-26 సందర్భంగా రూపాయి చిహ్నాం స్థానంలో తమిళ భాషలో ఆర్ఎస్ అని పెట్టడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అన్నారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.