
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళకు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరవుతారని తెలిసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ప్రయాగ్రాజ్కు రానున్నారని, దీనితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఇక్కడే జరగనుందని యూపీ సీఎం యోగి వివరాలు వెల్లడించారు.
ఈ మేరకు ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకుంభమేళాని సందర్శించే అవకాశం ఉందని సమాచారం. జనవరి 27న జరిగే మహా కుంభమేళలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 10న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్ని సందర్శిస్తారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో నిర్వహించే పలు ప్రధాన కార్యక్రమాలకు హాజరు కానున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 1న జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కూడా పాల్గొంటారని భావిస్తున్నారు. జనవరి 27న హోంమంత్రి అమిత్ షా తన షెడ్యూల్ ప్రకారం మహాకుంభ్లో పాల్గొంటారు. ఆయన సంగమంలో పవిత్ర స్నానం చేయనున్నారు. గంగపూజ నిర్వహించి అధికారులతో సమావేశం కానున్నారని తెలిసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం, మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళాకు జనం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో జనసమూహ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరచడపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమయంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచిస్తూ అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..