
దేవతల్లో ప్రథమ పూజ్యుడైన గణేశుడిని నిర్మలమైన భక్తి, విశ్వాసంతో పూజిస్తే.. అతని పనులన్నీ పూర్తి అవుతాయి. జీవితం సంతోషంగా ఉంటుంది. గణపతిను పూజించడం ద్వారా.. జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి.. సుఖ సంతోషాలు కలుగుతాయి. గజాననుడిని పూజించే వారు జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆశించిన విజయాన్ని పొందుతారు. గణేశుడిని జ్ఞానానికి, తెలివికి అధిపతిగా భావిస్తారు. భారతదేశంలో గణపతికు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిని సందర్శించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? గణపతి పూజ ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం..
ప్రేమ గణపతి ఆలయం (జోధ్పూర్): గణేశుడి ఆలయం రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో ఉంది. ఈ ఆలయంలో ప్రార్థనలు చేయడం ద్వారా పెళ్లి జరుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ప్రేమికులు భారీ సంఖ్యలో తమ ప్రేమను గెలిపించమని కోరుకుంటూ గణపతి ఆలయానికి చేరుకుంటారు. గణపతికి తమ ప్రియమైన వ్యక్తి పేరుతో దరఖాస్తులు చేసుకుంటారు. ఇక్కడ గణపయ్య జంటలను కలిపే దైవంగా ప్రసిద్ది పొందాడు. అందుకే ఈ ఆలయానికి ఇష్కియా గణేష్ మందిర్ అని పేరు పెట్టారు. బుధవారం ఈ ఆలయంలో ప్రేమికుల ఉత్సవంలా కనిపిస్తుంది. ప్రేమికులు తమ కోరికలతో బప్పాఆలయానికి చేరుకుంటారు.
ఖజ్రానా ఆలయం (ఇండోర్): మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న ఖజ్రానా ఆలయం గణపతి పూజకు చాలా ప్రత్యేకమైనది. ఈ పవిత్ర క్షేత్రంలో గణపతి బుద్ధి, సిద్ధిలతో పూజలను అందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని మహారాణి అహిత్యబాయి హోల్కర్ నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించే ఏ భక్తుడి దుఃఖానైనా విఘ్నహర్త మూర్తి తొలగిస్తుందని, అతని కోరికలను కూడా తీరుస్తాడని నమ్మకం. గణపతి భక్తులు ఏడాది పొడవునా ఖజ్రానా ఆలయానికి భారీ సంఖ్యలో చేరుకుంటారు. గణపయ్యకు భారీగా కానుకలను, విరాళాలను సమర్పిస్తారు.
దగదుషేత్ హల్వాయి గణపతి దేవాలయం (పూణే): పూణేలోని సుందర్ నగర్లో ఉన్న దగదుషేత్ హల్వాయి గణపతి ఆలయం అద్భుతాలతో నిండి ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ గణపతి ఆలయాన్ని దగ్దుసేత్ హల్వాయి నిర్మించాడని నమ్ముతారు. బంగారంతో చేసిన గణపతి బప్ప విగ్రహాన్ని చూసే ఏ భక్తుడికైనా అతని కష్టాలన్నీ తొలగిపోతాయని, అతని కోరికలు కూడా నెరవేరుతాయని నమ్మకం. వినాయక చవితి సమయంలో ఈ ఆలయ అందం చూడదగ్గది.
మోతి దుంగ్రి ఆలయం (జైపూర్): ఈ గణపతి ఆలయం రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని చాంద్పోల్ ప్రాంతంలో ఉంది. గణపతి అంకితం చేయబడిన ఈ ఆలయంపై భక్తులకు అపారమైన నమ్మకం ఉంది. ఆలయంలో బప్పాకు పెసరపప్పు లడ్డులను నైవేద్యంగా పెడతారు. మోతీ దుంగ్రీ ఆలయంలో 800 సంవత్సరాల పురాతన గణపతి విగ్రహం ఉంది. గణపతికి శనగలు నైవేద్యం పెట్టి అలంకరిస్తారు. కొత్త వాహనాలను ఈ ఆలయంలో పూజలను చేస్తారు. ఈ ఆలయంలో కొత్త వాహనాన్ని పూజిస్తే.. ప్రమాదం జరిగే అవకాశాలు చాలా తక్కువ అని నమ్ముతారు.
సిద్ధి వినాయక ఆలయం (ముంబై): దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని సిద్ధివినాయక ఆలయం దేశంలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. సిద్ధివినాయకుడి ద్వారంలోపల ఒకసారి అడుగు పెట్టిన భక్తుడు.. ఖాళీ చేతులతో తిరిగి రాడని నమ్ముతారు. గణపతి ఆశీర్వాదంతో ఎంత పెద్ద సమస్య అయినా కూడా క్షణాల్లో పరిష్కారమవుతాయి. సామాన్యులే కాదు బాలీవుడ్, టీవీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు, సెలబ్రేటీలు కూడా ఈ ఆలయానికి చేరుకొని తమ కోరికలను గణపతికి చెప్పుకుంటారు. ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారీ సంఖ్యలో భక్తులు గణపతికి వివిధ రకాల కానుకలను, నైవేద్యాలు సమర్పిస్తారు.