
కృతి శెట్టి తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది, ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి కృష్ణ శెట్టి వ్యాపారవేత్త, తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్. చిన్నతనం కృతి శెట్టి ఐడియా, షాపర్స్ స్టాప్, పార్లే, లైఫ్బాయ్ వంటి పలు బ్రాండ్ల వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
కృతిశెట్టికి 2021లో వచ్చిన తెలుగు చిత్రం ఉప్పెనతో గుర్తింపు లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో కృతిశెట్టి నటనకు ప్రశంసలు అందాయి. ఆ తర్వాత ఆమె శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించింది.
అయితే, ఆ తర్వాత ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే వంటి కొన్ని చిత్రాలు కమర్షియల్ గా నిరాశపరిచాయి. దీంతో తెలుగులో కృతిశెట్టికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ చిన్నది తమిళ సినిమాలపై దృష్టి సారించింది. మూడు తమిళ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది ప్రదీప్ రంగనాథ్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది
.