
బీఆర్ఎస్ సిల్వర్జూబ్లీ సభ కోసం ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు. ఎర్రవెల్లి నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్.. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజోతోత్సవ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ సభకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రేపు ఒంటి గంటకు ఎల్కతుర్తిలో బహిరంగ సభ స్థలానికి భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన వింతగా ఉందని కామెంట్స్ చేశారు. మార్పు కోరుకున్న రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయన్నారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్జూబ్లీ సభ ఉండాలన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు.. వరంగల్ బహిరంగ సభ తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలు వేసి.. ఆ తర్వాత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇక.. సిల్వర్జూబ్లీ మహాసభ నిర్వహణ బాధ్యతలను అప్పగించినందుకు కేసీఆర్కు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ సభను విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అనేక సభలను నిర్వహించిన ఘనత వరంగల్కు ఉందని.. నాటి ఉద్యమ స్ఫూర్తితో మరోసారి పని చేస్తామని చెప్పారు. అభివృద్ధిలో హైదరాబాద్తో పోటీపడేలా వరంగల్ను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి