
ముంబై ఇండియన్స్ (MI) వరుసగా రెండు మ్యాచ్లను గెలిచి ఐపీఎల్ ( IPL) 2025లో ప్లేఆఫ్స్కు చేరుకోవాలనే ఆశలను సజీవంగా ఉంచుకుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)ను వాంఖడే స్టేడియంలో 4 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ముంబై ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు గత సీజన్ ఫైనలిస్ట్స్ సన్రైజర్స్ హైదరాబాద్ తమ విజయ పరంపరను కొనసాగించలేకపోయింది. దీంతో ఐదవ ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకునే ఆశలపై తీవ్ర దెబ్బ పడింది.
వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారీ స్కోరు నమోదు అవుతుందని భావించారు. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కూడా ఈ మ్యాచ్లో జట్టు తొలిసారిగా 300 పరుగుల మార్కును దాటగలదని అంచనా వేశాడు. కానీ, మ్యాచ్ ప్రారంభమైన వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఈ మ్యాచ్ జరిగిన పిచ్పై, సన్రైజర్స్ జట్టు ఇబ్బంది పడింది. 170 పరుగుల మార్కును దాటలేకపోయింది.
హైదరాబాద్ బ్యాటింగ్ వైఫల్యం..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ల డేంజరస్ ఓపెనింగ్ జోడీ బౌండరీలు బాదడంలో ఇబ్బంది పడింది. అభిషేక్ (40) కొన్ని మంచి షాట్లతో జట్టుకు వేగవంతమైన ఆరంభం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ హెడ్ (28) తన ఇన్నింగ్స్ అంతటా పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా వీరు 10 ఓవర్లలో 75 పరుగులు మాత్రమే చేయగలిగారు. 15 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక్కడ, హెన్రిక్ క్లాసెన్ (37) స్లో ఇన్నింగ్స్ ఆడి 18వ ఓవర్లో 21 పరుగులు చేశాడు. ఆ తర్వాత 20వ ఓవర్లో హైదరాబాద్ 3 సిక్సర్లతో సహా 22 పరుగులు చేసి, మొత్తం 162 పరుగులకు చేరుకుంది.
ముంబై కూడా కష్టంగానే..
దీనికి ప్రతిస్పందనగా ముంబై తుఫాన్ ఆరంభాన్ని అందుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ వాంఖడేలో 3 సిక్సర్లు కొట్టి అభిమానులను అలరించాడు. కానీ, మరోసారి రోహిత్ (26) తన ఇన్నింగ్స్ను పెద్ద స్కోరుగా మలచుకోవడంలో విఫలమయ్యాడు. ర్యాన్ రికెల్టన్ (31), సూర్యకుమార్ యాదవ్ (26) ఫోర్లు, సిక్సర్లు బాది జట్టును కష్టాల నుంచి బయట పడేశారు. ఇంతలో, విల్ జాక్స్ (36) కీలక ఇన్నింగ్స్తో జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. పాట్ కమ్మిన్స్ (3/26) చివరికి రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా కొద్దిసేపు టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పాడు. కానీ, అది చాలా ఆలస్యం అయింది. చివరికి హార్దిక్ పాండ్యా (21), తిలక్ వర్మ (17) జట్టును విజయపథంలో నడిపించారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..