
ఐపీఎల్ 2025లో భాగంగా అన్ని టీమ్స్ ఒక్కో మ్యాచ్ ఆడేశాయి. అయితే ఈ 18వ ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ, కేకేఆర్ను పూర్తిగా డామినేట్ చేసి కంఫర్ట్బుల్గా గెలిచింది. తొలి మ్యాచ్లో తమ సొంత గ్రౌండ్లో, తమ అభిమానుల మధ్య ఈ ఓటమిని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే తర్వాతి మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే కసితో తన వద్ద ఉన్న అన్ని అవకాశాలు వాడుకోవాలని డిసైడ్ అయ్యాడు.
అందుకోసం ఏకంగా ఎంతో ప్రతిష్టాత్మక కోల్కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్నే మార్చేయాల్సిందిగా ఈడెన్ స్టేడియం పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీని కోరినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో క్యూరేటర్ ముఖర్జీ చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. తాను క్యూరేటర్గా ఉన్నంత వరకు ఈడెన్ పిచ్ మారదంటూ స్పష్టం చేశారు. కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె చేసిన రిక్వెస్ట్ను ఆయన ఒప్పుకోలేదు. ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రహానె మాట్లాడుతూ.. పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందని అనుకున్నాం.. కానీ, రెండు రోజులుగా పిచ్ను పట్టాలతో కప్పి ఉంచారంటూ.. పరోక్షంగా పిచ్ క్యూరేటర్పై రహానె విమర్శలు చేశాడు.
దీనిపై క్యూరేటర్ స్పందిస్తూ.. ఎన్నో ఏళ్లుగా ఈడెన్ పిచ్ ఇలాగే ఉంది, ఇది నాది సహన నైజం. ఇక్కడ ఇష్టం వచ్చినట్లు పిచ్ను మార్చి, దాన్ని స్వభావాన్ని నేను దెబ్బతీయలేను అంటూ ముఖర్జీ వెల్లడించారు. కాగా ముఖర్జీ ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్గా 2015లో నియమితులయ్యారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హయాంలో సుజన్ ముఖర్జీ ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్గా అపాయింట్ అయ్యారు. దాదాపు పదేళ్లుగా ఆయన ఈడెన్ గార్డెన్స్ పిచ్ను మ్యాచ్లకు కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ పదేళ్ల కాలంలో ముఖర్జీ ఎన్నో మ్యాచ్లకు పిచ్లను సిద్ధం చేసి ఇచ్చారు. అయితే మరో విషయం ఏంటంటే.. రూల్స్ ప్రకారం ఐపీఎల్ టీమ్స్కు పిచ్ను తమకు అనుకూలంగా కోరి మార్చుకునే అధికారం లేదు.