

హైదరాబాద్లో ఇటీవల కాలంలో బెట్టింగ్ మోజులో పడి చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాను. అయితే మరి కొంతమంది మాత్రం బెట్టింగ్ ద్వారా కోల్పోయిన డబ్బులను తిరిగి సంపాదించాలనే ధ్యేయంతో అడ్డదారులు తొక్కుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడుతుంది. ముఖ్యంగా 20 నుంచి 40 సంవత్సరాల వయసు గల యువకులు ఎక్కువ సంఖ్యలో బెట్టింగ్ మాయలో పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు.
తాజాగా కూకట్పల్లిలో జరిగిన ఓ ఘటన చూస్తే బెట్టింగ్ ప్రభావం ఏ రీతిలో ఉందో అర్థమవుతుంది. కూకట్పల్లిలో రెండు రోజుల క్రితం ఒక చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళను గమనించిన యువకుడు ఆమె ముగ్గు వేసి ఇంటి లోపలికి వెళ్ళగానే ఆమె వెనకాలే ఫాలో అయ్యి మంచినీళ్లు ఉన్నాయని అడిగాడు. ఆమె మంచినీళ్లు తెచ్చే క్రమంలోనే ఆమె మెడలో ఉన్న గొలుసు తీసుకుని పరారయ్యాడు. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు.
నిందితుడిని గోదావరి జిల్లాకు చెందిన సాయి తేజ్గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో ర్యాపిడో బైక్ నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కొద్ది నెలల క్రితమే తనకు బెట్టింగ్ అలవాటైందని ర్యాపిడో ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం బెట్టింగ్కే పెడుతున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో తనకి భారీ నష్టాలు రావడంతో ఎలాగైనా సరే కోల్పోయిన డబ్బును తిరిగి సంపాదించాలని అనుకున్నాడు. దీంతో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్గా చేసి వారి మెడలోని గొలుసులను అపహరించి వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం కూకట్పల్లిలో ఉన్న ఒక మహిళ మెడలో నుండి కూడా ఇదే రీతిలో గొలుసు లాకెళ్లాడు. పోలీసులు నిందితుడు సాయి తేజను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.