

హైదరాబాద్లో అందరూ హోళీ సంబరాల్లో మునిగి తేలుతుంటే ధూల్పేట్ మాత్రం గంజాయి మత్తులో మునిగి తేలుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైగా కుల్ఫీ ఐస్క్రీమ్లలో గంజాయిను కలిపి విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో గంజాయిని మొత్తం నిరోధించేందుకు ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. ఈ తరుణంలోనే ధూల్పేట్లో గంజాయి విక్రయాలు చాలావరకు తగ్గాయి. ధూల్పేట్లో నిరంతరం పోలీసుల నిఘా ఉంటుండటంతో శివారు ప్రాంతాలకు వెళ్లి గంజాయి విక్రయాలు చేపడుతున్నారు.
అయితే మార్చి 14న(గురువారం) హోళీ సందర్భంగా పోలీసు నిఘా తక్కువగా ఉంటారని భావించిన ధూల్పేట్ వాసులు కొంతమంది మళ్లీ గంజాయి విక్రయాలు ప్రారంభించారు. ఎలాంటి అనుమానం రాకుండా కుల్ఫీ ఐస్ క్రీమ్లలో.. అలాగే బర్ఫీ స్వీట్లలో గంజాయిని కలిపి విక్రయాలు చేపడుతున్నారు.
ఐస్ క్రీమ్లు, స్వీట్ల మధ్యలో గంజాయిని అమ్ముతున్నారు అని సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు ధూల్పేట్కి చేరుకున్నారు. సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఐస్క్రీమ్లు విక్రయించేవాడని పోలీసులు దర్యాప్తులో బయటపడింది. దీంతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు.. సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు వద్ద నుంచి 100 కుల్ఫీ ఐస్ క్రీమ్లతో పాటు 72 బర్ఫీ స్వీట్లను స్వాధీనం చేసుకున్నారు.