
ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడికి 2023లో వేరేచోట కిడ్నీల్లో రాళ్లు తీయడానికి మామూలు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత అతడి మూత్రనాళాలు పూర్తిగా పూడుకుపోయాయి. దాంతో క్రియాటినైన్ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయి.. విపరీతమైన నొప్పి, తరచు జ్వరంతో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. కిడ్నీలు రెండూ పాడైపోవడంతో తాత్కాలికంగా అతడికి ట్యూబులు (నెఫ్రోస్టమీలు) అమర్చి బయటి నుంచి యూరిన్ పంపేవారు. పలు రాష్ట్రాలు తిరిగినా ఏ హాస్పిటల్ చేర్చుకోకపోవడంతో చివరకు హైదరాబాద్ వచ్చారు. పూర్తి స్థాయి పరీక్షలు చేసిన తర్వాత.. అతడి మూత్రనాళాలు చాలావరకు పూడుకుపోయినట్లు నిర్ధారించారు. ఇది చాలా అరుదైన.. సమస్యాత్మ పరిస్థితి అని ఓ అవగాహనకు వచ్చారు.
కుడివైపు కిడ్నీ కోసం డాక్టర్లు ముందుగా అతడి సొంత అపెండిక్స్ తీసుకుని, పూడుకుపోయిన మూత్రనాళానికి బదులు దాన్ని అమర్చారు. అపెండిక్స్ కూడా మూత్రనాళం పరిమాణంలోనే ఉంటుంది. రోబోటిక్ ఆపరేషన్తో దీన్ని మార్చారు. ఇది చాలా అరుదుగా చేసే చికిత్స. దీన్ని అపెండిక్స్ ఇంటర్పొజిషన్ అంటారు.
“మూత్రనాళం బాగా పూడిపోఉయినప్పుడు దాన్ని బాగుచేయడానికి ఇది అత్యంత సృజనాత్మకమైన, మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి. సాధారణంగా ఇలా చేయరు. కానీ ఈ రోగి కేసులో ఇదే సరైన పరిష్కారం” అని ఏఐఎన్యూలోని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్,యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపారు. ఈ చికిత్స అనంతరం అతడి కుడి కిడ్నీ బాగుపడింది. దాంతో బయట అమర్చిన ట్యూబులను తీసేశారు.
సొంత కిడ్నీ మార్పిడి ఇలా..
రెండు నెలల తర్వాత అతడి ఎడమవైపు కిడ్నీ ఇంకా అలాగే ఉంది. అపెండిక్స్ కుడివైపే ఉంటుంది కాబట్టి రెండోవైపు పేగులను తీసి అమర్చవచ్చు. కానీ, అందులో ఈ వృద్ధుడికి సమస్యలు ఉండడంతో అత్యంత అరుదైన పరిష్కారాన్ని డాక్టర్లు ఎంచుకున్నారు. అదే.. సొంత కిడ్నీనే మార్చడం.
ఈ సంక్లిష్టమైన చికిత్సలో.. రోగి ఎడమ కిడ్నీని రక్తనాళాలతో కలిపి తీశారు. తర్వాత దాన్ని కొంత కింది భాగంలో అమర్చారు. తద్వారా పాడైన మూత్రనాళాన్ని బైపాస్ చేసి, బాగున్న భాగంలోంచి మూత్రం వెళ్లేలా చేశారు.
“సొంత కిడ్నీ మార్పిడి అనేది చాలా పెద్ద ఆస్పత్రుల్లోనే చేస్తారు. ఇది చిట్టచివరి పరిష్కారం. చాలా కచ్చితత్వంతో చేయాల్సిన శస్త్రచికిత్స. అతడి శరీరంలోనే అతడి కిడ్నీకి వేరే ఇల్లు ఇచ్చాం” అని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ విజయ్ మద్దూరి తెలిపారు.
ఇప్పుడా బెంగాలీ వృద్ధుడు పూర్తి సాధారణ స్థితికి చేరుకున్నారు. కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, క్రియాటినైన్ స్థాయి సాధారణంగా ఉంది. నొప్పి, ఇతర సమస్యలూ తగ్గిపోయాయి.
“ఈ కేసు వైద్యపరంగా ఓ సరికొత్త విజయం. రెండు కిడ్నీలను కాపాడేందుకు రెండు విభిన్న రకాల, అత్యాధునిక శస్త్రచికిత్సలు చేశాం. ఒకదాంట్లో అపెండిక్స్ను ఉపయోగించగా, మరోదాంట్లో సొంత కిడ్నీనే మార్చారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలా చేసినవాటిలో విజయవంతం అయినవే చాలా తక్కువ” అని ఏఐఎన్యూ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు.
ఈ శస్త్రచికిత్సల్లో డాక్టర్ తైఫ్ బెండెగెరి కూడా పాల్గొన్నారు. రెసిడెంట్ వైద్యులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ ఆసిత్ సాయపడ్డారు.

AINU Doctors
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..