
పాపం.. ఎలక్ట్రిక్ బైక్ ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాత్రి పూట ఛార్జింగ్ పెట్టి పడుకుంటే.. తెల్లారి లేచే సరికి ఇల్లంతా మంటలు అంటుకున్నాయి. ఎలక్ట్రిక్ బైక్లో చెలరేగిన మంటల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు అంటుకోవడంతో మేల్కున్న తండ్రి ఎలాగైనా తన 9 నెలల కూతుర్ని కాపాడుకోవాలనుకున్నాడు. అందుకే కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టాడు. కానీ, అతని ప్రయత్నం ఫలించలేదు. మంటలు అంటుకొని తండ్రీ కూతురు ఇద్దరూ మృతి చెందారు. ఈ దారణ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 31 ఏళ్ల ఎన్.గౌతమన్ ఎలక్ట్రిక్ మోటార్ మెకానిక్గా పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య మంజు, తొమ్మిది నెలల కూతురితో కలిసి మధురవోయల్లో నివశిస్తున్నాడు.
ప్రతీ రోజూ లాగా శుక్రవారం రాత్రి తన బైక్ను పోర్టికోలో ఛార్జ్ చేసి గేటుకు తాళం వేసి పడుకున్నాడు. తెల్లరేసరికి తన బైక్ మంటల్లో మునిగిపోవడం చూసి గౌతమన్ మేల్కొన్నాడు. మంటలు దగ్గరగా రావడంతో, అతను తన బిడ్డను మొదటి అంతస్తుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ, ఇంతలో మంటలు వారికి కూడా అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో అతని భార్య మంజు కూడా గాయపడింది. స్థానికులు ముగ్గుర్ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి, గౌతమన్ మరణించారు. తండ్రీ కూతుర్ల మరణంతో ఆ ఇంటితో పాటు స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ఎలక్ట్రిక్ బైక్ల్లో మంటలు చెలరేగి తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఘటన తర్వాత ఎలక్ట్రిక్ బైక్ వాడే వారు మరింత ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.