
బర్త్ రైట్ అంశంలో ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో దుమారం రేగుతోంది. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యూ హ్యాంప్షైర్ కోర్టులో అమెరికా పౌరహక్కుల సంస్థ పిటిషన్ వేసింది. NAACP లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్, స్టేట్ డెమొక్రసీ డిఫెండర్స్ ఫండ్, ఆసియన్ లా కాకస్ ఈ పిటిషన్కు జత కలిశాయి. వలసదారుల మద్దతు సంఘాలతో న్యాయపోరాటం మొదలైంది. పౌరసత్వాన్ని నిర్ణయించాల్సింది ట్రంప్ కాదని పిటిషన్దారులు వాదిస్తున్నారు. ఈ అంశాన్ని ఖరారుచేయాల్సింది అమెరికా కాంగ్రెస్, రాజ్యాంగమని వారు లేవనెత్తిన పాయింట్. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వలసదారుల కుటుంబాలు, పిల్లలను అమెరికా నుంచి జీవితకాలంపాటు తరిమేసేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ట్రంప్పై న్యాయపోరాటానికి విపక్ష డెమొక్రాట్ పాలిత రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి.
తాజాగా తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్గా అక్కడి పౌరసత్వం రావాలంటే.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికన్ పౌరసత్వం కల్గి ఉండాలి.. పర్మినెంట్ రెసిడెంటైనా ఉండాలి లేదా, అమెరికన్ ఆర్మీలో పని చేసి వుండాలి. ఈ కండీషన్స్ను మ్యాచయితే ఓకే. లేదంటే జన్మతః పౌరసత్వం దక్కదు. ఇప్పుడు దీనిపైనే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సీన్ కోర్టుదాకా వెళ్లింది.
ట్రంప్ నిర్ణయం భారతీయులకు షాక్ ఇచ్చింది. H1-B వీసాలతో అమెరికాకు వెళ్లినవారు, అక్కడే పిల్లల్ని కంటే, వారు ఆటోమేటిక్గా అమెరికన్ పౌరులు అవుతారు. వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. కానీ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, H1-B వీసాలు తీసుకుని అమెరికాకు వెళ్లి, అక్కడ పిల్లల్ని కంటే, ఆ పిల్లలకు ఆటోమేటిక్గా అక్కడి పౌరసత్వం లభించదు. అయితే ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి 30 రోజుల గడువు ఇచ్చారు ట్రంప్. అదే గ్రీన్ కార్డు లభించినవారికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ట్రంప్ పౌరసత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటామని తెలుగువారు అధికంగా నివసించే న్యూజెర్సీ రాష్ట్రం ప్రకటించింది. 18 రాష్ట్రాలతో కలసి న్యాయపోరాటం చేస్తామని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాట్ ప్లాట్కిన్ చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడే కానీ.. రాజు కాదన్నారాయన. రాజ్యాంగాన్ని మార్చేసే.. చట్టాలను ఉల్లంఘించే అధికారం లేదన్నారు న్యూజెర్సీ అటార్నీ జనరల్. అయితే మరో 4 రాష్ట్రాలు ఈ పోరాటానికి జత కలిశాయి. అంటే ట్రంప్ నిర్ణయంపై మొత్తం 22 రాష్ట్రాలు న్యాయపోరాటం చేస్తామంటున్నాయి.
అమెరికాలో పుడితే ఆ దేశపౌరసత్వం ఆటోమేటిగ్గా వచ్చే చట్టం ఇప్పటి వరకూ ఉంది. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు కూడా జన్మతః పౌరసత్వం వస్తోంది. దీన్ని ఇప్పుడు ట్రంప్ కొట్టేశారు. అమెరికాలో ఉన్న NRIల లెక్క ఓసారి చూస్తే.. ప్రస్తుతం అక్కడ మనోళ్లు 54 లక్షల మంది ఉన్నారు. పెద్దవాళ్లు వలస వెళ్లాక అక్కడ పుట్టిన పిల్లలు 34 శాతం మంది ఉన్నారు. వాళ్లు కాకుండా మిగతావాళ్లంతా ఇప్పుడు వలసదారుల కిందకే వస్తారు.. డిపెండెంట్ లాంటివి ఇకపై కుదరకపోచ్చు. అందుకే ట్రంప్ ఆదేశాలపై ఇప్పుడు ఇంత ఆందోళన వ్యక్తమవుతోంది.
– చైనా సహా కొన్ని దేశాలు “బర్త్ టూరిజం”కి అమెరికాను కేంద్రంగా చేసుకుంటున్నాయని.. అలాంటి వారికి చెక్ పెట్టేందుకే ఈ నిబంధన తెచ్చినట్టు ట్రంప్ టీమ్ చెప్తోంది.