
అమరావతి, మార్చి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లోని కరిక్యులమ్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి రెండు మేజర్ సబ్జెక్టుల విధానాన్ని తీసుకురానున్నట్లు సర్కార్ నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు మల్టీడిసిప్లీనరీ విధానంలో మూడు సబ్జెక్టుల విధానం ఉండేది. దాన్ని తొలగించి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ను తీసుకువచ్చింది. దీనితోపాటు మరో మైనర్ సబ్జెక్టులను చదివేలా మార్పులు చేశారు. సింగిల్ మేజర్ కారణంగా అనేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అన్ని సబ్జెక్టులను అందుబాటులో ఉంచలేని పరిస్థితి ఏర్పడింది. మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులకు అందుబాటులో ఉంచితే అధ్యాపకుల సమస్య ఏర్పడుతుందని, కొన్ని సబ్జెక్టులను కొన్ని కాలేజీలకే పరిమితం చేశారు. దీంతో విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బీఎస్సీ కంప్యూటర్, బీకాం కంప్యూటర్ లాంటి కోర్సులనే అత్యధికంగా ప్రవేశపెట్టాయి. విద్యార్థుల డిమాండ్కు అనుగుణంగా కోర్సులను మార్పు చేసుకున్నాయి. దీంతో అధిక మంది విద్యార్ధులు ప్రైవేట్ వైపు మొగ్గు చూపారు. సింగిల్ మేజర్పై విమర్శలు వస్తున్నాయి. కూటమి సర్కార్ ఈ అంతరాన్ని గుర్తించి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ స్థానంలో కొత్తగా రెండు మేజర్ సబ్జెక్టుల విధానం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దీనితోపాటు ప్రాధాన్యత కలిగిన సబ్జెక్టులను మైనర్లుగా అమలు చేయాలని భావిస్తున్నారు. యూజీసీ ప్రకారం మూడేళ్ల డిగ్రీకి 120 క్రెడిట్లు ఉండాలి. నాలుగేళ్ల డిగ్రీకి 160 క్రెడిట్లు ఉండాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2020-21 నుంచి నాలుగేళ్ల డిగ్రీని అమలు చేస్తున్నా అధిక మంది విద్యార్థులు మూడేళ్ల డిగ్రీనే ఎంచుకుంటున్నారు.
యూజీసీ ప్రకారం మేజర్ సబ్జెక్టుకు 50% క్రెడిట్లు, రెండో మేజర్కు 40% క్రెడిట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, డాటా అనలిటిక్స్ లాంటి వాటిల్లో మైనర్ డిగ్రీని ప్రవేశ పెట్టడంపైనా కసరత్తు చేస్తున్నారు. ఇలా మూడు సబ్జెక్టుల విధానం తీసుకువచ్చి మల్టీడిసిప్లీనరీగా డిగ్రీ కోర్సులు అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు డిగ్రీ కరిక్యులమ్ మార్పు చేసేందుకు ఉన్నత విద్యామండలి 12 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి అకడమిక్ అధికారి శ్రీరంగం ఈ కమిటీకి సభ్య కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ మూడు వారాల్లో నివేదిక సమర్పించనున్నగ్తు ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.