

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ – యూకే పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యూకేకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని సన్మానించనున్నారు. మార్చి 19న జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.
బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంతుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దీనిని చిరంజీవి అందుకోనుండటం మరో విశేషం. ఇది మెగాస్టార్ కీర్తి కీరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది. యు.కె కు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవి ని సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్మెంట్ అవార్డ్ ఇవ్వటం అనేది ప్రత్యేకమైన సందర్భం.
2024లో భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను చిరంజీవి అందుకున్నారు. అలాగే గత ఏడాది డ్యాన్సర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థాం సంపాదించుకున్నారు. ఇక ఎ.ఎన్.ఆర్ శత జయంతి సందర్భంగా, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.