

మెగాస్టార్ చిరంజీవి పేరు మీదున్న రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ అందుకున్న మెగాస్టార్.. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ – యూకే పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనున్న విషయం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ, యూకేకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని సన్మానించనున్నారు. మార్చి 19న జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. కాగా తాజాగా చిరంజీవి లండన్ లో ల్యాండయ్యారు. చిరంజీవికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు లండన్ వాసులు ఎగబడ్డారు.