
హైదరాబాద్, మార్చి 30: నకిలీ స్కూళ్లకు చెక్ పెట్టేందుకు సీబీఎస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి పాఠశాలలో 75 శాతం హాజరు లేకుంటే 12వ తరగతి పరీక్షలు రాయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా జరిగిన సీబీఎస్ఈ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. వేలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్, వైద్య విద్య లక్ష్యంతో కేవలం 12వ తరగతి పరీక్షలు రాసేందుకే కొంత డబ్బు ముట్టజెప్పి డమ్మీ పాఠశాలల్లో చేరుతున్నారు. రెగ్యులర్ తరగతులకు హాజరుకాని విద్యార్థులు 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరుకాకుండా నిషేధించడానికి 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆకస్మిక తనిఖీల సమయంలో పాఠశాలల రిజిస్టర్లలో హాజరైనట్లు ఉండి.. అక్కడ విద్యార్థులు లేకున్నా వారిని తుది పరీక్షలు రాయడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాంటి వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ద్వారా పరీక్షలు రాసుకునేలా అవకాశం కల్పించామని, అందుకు ఆ సంస్థ అధికారులతో కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే వైద్య అత్యవసర పరిస్థితులు, జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇతర తీవ్రమైన కారణాల వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బోర్డు 25 శాతం హాజరు సడలింపును అందిస్తుందని బోర్డు సభ్యులు తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి బీసీ విద్యానిధి పథకానికి దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య కోసం అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులకు ఆర్ధిక సాయం అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి ఓ ప్రకనలో తెలిపారు. డిగ్రీలో 60 శాతం మార్కులతోపాటు ఈ ఏడాది జులై 1 నాటికి 35 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అలాగే అభ్యర్ధుల కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలని సూచించారు. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.