
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL 5జీ సేవలు త్వరలో దేశంలో మొదలు కానున్నాయి. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. BSNL 5G నెట్వర్క్ను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈ సంవత్సరం జూన్ నాటికి ప్రారంభమవుతుందని తెలుపగా, అనేక మంది యూజర్లు ఈ 5జీ సేవలు ఎక్కడి నుంచి మొదట ప్రారంభం అవుతుందని ఆసక్తితో ఉన్నాయి.
అలాగే ప్రపంచంలో సొంత టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ ఉన్న ఐదు దేశాలలో భారతదేశం ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. 18 సంవత్సరాల తర్వాత BSNL లాభదాయకంగా మారిందని, ప్రభుత్వం 6G టెక్నాలజీతో ముందుకు సాగాలని యోచిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా 1 లక్ష స్థానిక 4G మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ సంస్థ CMD, రాబర్ట్ జే రవి 5G సేవల గురించి మరిన్ని కీలక విషయాలను పంచుకున్నారు.
ఇప్పటికే పైలట్ పరీక్షలు
ఆయన చెప్పిన ప్రకారం చూస్తే.. BSNL 5G సేవలు మొదట ఢిల్లీలో ప్రారంభమవుతాయన్నారు. నెట్వర్క్ యాజ్ ఎ సర్వీస్ (NaaS) మోడల్ను ఉపయోగించి, కంపెనీ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఢిల్లీ తర్వాత, మరిన్ని నగరాలకు ఈ 5జీ నెట్వర్క్ను విస్తరించడానికి సంస్థ సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, మెరుగైన డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్, అధిక నాణ్యత గల కాల్స్ వంటి అనేక ప్రయోజనాలను పొందుతారన్నారు. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడుతుందని సీఎండీ వెల్లడించారు.
టవర్ల ఏర్పాటులో..
గత సంవత్సరం, BSNL ఢిల్లీలో 5G సేవలపై పైలట్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు స్థానిక విక్రేతల సహాయంతో జరిగాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) వంటి సంస్థలు BSNL కోసం 100,000 కొత్త 4G మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడంలో సహాయపడుతున్నాయి. ఈ భాగస్వామ్యాలు BSNL 5G సేవలను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి