

మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. వారు ఆర్థిక స్వావలంభన సాధించేందుకు దోహదపడుతున్నాయి. అయితే అలాంటి పథకాలపై మన మహిళలకు అంతగా అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక భద్రత కోసం లాభదాయకమైన అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. ఇప్పటికే కొన్ని పథకాలు అందుబాటులో ఉండగా.. ఇంకా కొత్త పథకాలు తీసుకురావడంతో పాటు పాత పథకాలను కూడా ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేస్తూ.. మరింత ఆకర్షణీయంగా మార్చుతోంది. అలాంటి బెస్ట్ పథకాలు ప్రత్యేకించి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్(ఎంఐఎస్)..
పోస్టాఫీస్ నిర్వహించే ఈ పథకం స్థిరమైన ఆదాయం నెలనెలా కావాలనుకునే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఒకసారి పెట్టుబడి పెట్టి.. ప్రతి నెలా వడ్డీని పొందొచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.40గా ఉంది. సింగిల్ గా లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. దీనిలో కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్టంగా సింగిల్ అకౌంట్లో రూ. 9లక్షలు, జాయింట్ ఖాతాలో అయితే రూ. 15లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్వై)
ఇది ఆడ పిల్లలకు ఉద్దేశించిన పథకం. వారి చదువులు, పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉద్దేశించిన పథకం ఇది. ఇది అత్యధిక వడ్డీని అందించే స్కీమ్. 8.20శాతం వడ్డీ రేటు ఉంటుంది. 10ఏళ్ల లోపు వయసున్న ఆడ పిల్లల పేరు మీ అకౌంట్ ఓపెన్ చేయాలి. 15ఏళ్ల పాటు పెట్టుబడి కొనసాగించాలి. రూ. 250 నుంచి రూ. 1.50లక్షల వరకూ ఏడాది పెట్టుబడి పెట్టొచ్చు. మెచ్యూరిటీ తర్వాత అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తారు. ఆదాయ పన్ను కూడా పడదు.
మహిళా సమ్మాన్ సర్టిఫికెట్(ఎంఎస్ఎస్సీ)..
మహిళలకు ఉద్దేశించిన మరో మంచి స్కీమ్ ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రారంభించింది. దీనిలోకనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 2లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. ఈ స్కీమ్ రెండేళ్లలో మెచ్యూర్ అవుతుంది. 7.5శాతం వడ్డీ చెల్లిస్తారు. వాస్తవానికి మార్చి 31తోనే ఈ పథకం ముగిసింది. కేంద్ర ప్రభుత్వం దీనిని కొనసాగిస్తుందో లేదో తెలీదు. అయితే ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారు మెచ్యూరిటీ కోసం ఎదురు చూస్తున్నారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)..
దీనిలో ఏటా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పోస్టాఫీసు లేదా ఏదైనా జాతీయ బ్యాంకులో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఒకరి పేరుతో మాత్రమే ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కాల వ్యవధి 15ఏళ్లు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తారు. వడ్డీ రేటు 7.10శాతం వరకూ ఉంటుంది. ఏడాదికి కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.50లక్షల వరకూ డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కేవలం మహిళలకే ప్రత్యేకించింది కాదు.. అందరూ దీనిలో పెట్టుబడి పెట్టొచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ)..
మంచి ప్రయోజనాలు అందించే స్కీమ్ ఇది. ఈ పథకం వ్యవధి ఐదేళ్లు. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఈ అకౌంట్ తెరవొచ్చు. అకౌంట్ హోల్డర్ మైనర్ అయితే వారి పేరున సంరక్షకులు ఖాతా తెరవొచ్చు. కనిష్టంగా రూ. 1000నుంచి గరిష్ట పరిమితి లేదు. దీనిపై వడ్డీ రేటు 7.70శాతంగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత అసలు, వడ్డీ కలిపి అందిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..