
వారానికి ఐదు రోజుల పని విధానాన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెలలో అన్ని ఆదివారాలతో పాటు ప్రతి రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులను సెలవులు ఇస్తున్నారు.
ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నగదు లావాదేవీలతో ఇతర సేవలను పొందేందుకు ఓపెన్ చేసి ఉంటున్నాయి. అయితే ఈ విధానం వల్ల ఇతర ఉద్యోగులకు బ్యాంకు సేవలను పొందడం కష్టంగా ఉంటుంది.
ముఖ్యంగా ఇతర శాఖల ఉద్యోగులతో పాటు రోజు వారీ పనులకు వెళ్లే ప్రజలు సైతం బ్యాంకు సేవలను వినియోగించుకోవాలంటే కచ్చితంగా సెలవు పెట్టాల్సి వస్తుందని, సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా బ్యాంకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బ్యాంకింగ్ ఉద్యోగుల ప్రతిపాదనలతో పాటు సామాన్యుల డిమాండ్ మేరకు కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంకులకు ప్రతి శని, ఆదివారాల్లో సెలవు ఇవ్వనుంది.
వారానికి ఐదు రోజుల పని విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే సాయంత్రం నాలుగు గంటల తర్వాత బ్యాంకులు పని చేయనున్నాయి.