

బుధవారం (19-03-25) శ్రీకాకుళం జిల్లా-13, విజయనగరం-18, పార్వతీపురం మన్యం-14, అల్లూరి సీతారామరాజు-3, కాకినాడ-2, తూర్పుగోదావరి-7, ఏలూరు-1 మండలాల్లో(58) వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు గురువారం 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
మంగళవారం నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో 42.7°C, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.6°C, వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో 41.8°C, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.5°C, అనంతపురం జిల్లా నాగసముద్రం, అన్నమయ్య జిల్లా వత్తలూరు 41°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే 7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 42 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.