
ప్రకాశంజిల్లా గిద్దలూరులో ఓ యువకుడు రైల్వే హై టెన్షన్ 25 కే.వీ వైర్లను పట్టుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయాడు. ఈ విషాద ఘటన గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఆగిన గూడ్స్ రైలును ఆ యువకుడు ఎక్కి హై టెన్షన్ వైర్ను పట్టుకున్నాడు. ఆ యువకుడికి విద్యుత్ షాక్ కొట్టి తీవ్ర గాయాలు కావడంతో గూడ్స్ రైలుపై నుంచి కిందపడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే అంబులెన్స్లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం క్షతగాత్రుడు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోవడంతో విద్యార్ధి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. హై టెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు చెన్నైలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట్ల అమర్నాథ్గా రైల్వే పోలీసులు గుర్తించారు.
45 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఆత్మహత్యకు ప్రేమే కారణమా..
కాచిగూడ రైలులో కాచిగూడ నుంచి ప్రయాణిస్తూ అమర్నాథ్తో పాటు అమర్నాథ్ స్నేహితుడు శివశంకర్ గిద్దలూరులో దిగారు. అమర్నాథ్ గూడ్స్ రైలు ఎక్కి కరెంటు వైర్ పట్టుకుంటున్న సమయంలో శివశంకర్ అతనిని ఆపేందుకు ప్రయత్నించాడు. బలవంతంగా గూడ్స్ రైలు ఎక్కిన అమర్నాథ్ విద్యుత్ వైర్ పట్టుకొని తీవ్ర గాయాలు పాలయ్యాడు. అమర్నాథ్ చెన్నైలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ 45 లక్షల ప్యాకేజీని అమర్నాథ్కు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. చేతికొచ్చిన బిడ్డ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు అమర్నాధ్ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందో అర్ధం కావడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అమర్నాధ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్నారు. తాను ప్రేమించిన యువతితో పెళ్ళి జరగదన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.