
ఓ టీవీ ఛానల్లో వచ్చిన క్రైం కథను చూసి ఇన్స్పైర్ అయిన ఓ మహిళ చోరీలు చేయడం ప్రారంభించింది. మొదటిలో వర్కవుట్ అయినా అప్పుడప్పుడూ కథ అడ్డం తిరిగి పోలీసులకు అడ్డంగా దొరికిపోతోంది. ఒకసారి ఇలాగే అరెస్టయింది. అయినా ఆమె బుద్ది మారలేదు. ఈజీ మనీకి అలవాటు పడి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ విజయవాడ, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు ప్రాంతాల్లో నమ్మకంగా ఉంటూ ఒంటరి మహిళలకు మత్తు మందు ఇచ్చి అనంతరం ఒంటిపై బంగారంతో ఉడాయిస్తోంది. ఈ క్రమంలో టంగుటూరులో ఇదే విధంగా చోరీ చేసి పోలీసుల చేతికి చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు 35 లక్షల విలువైన బంగారు నగలు, మత్తుమందు బిళ్లలు స్వాధీనం చేసుకున్నారు.
వృద్ద మహిళలకు మత్తుమందు ఇచ్చి వరుస దొంగతనాలు చేసున్న కిలాడీ లేడిని ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామానికి చెందిన గంటా ఎలీశమ్మ ఒంగోలులోని బాలాజీ నగర్లో కొంతకాలంగా నివాసం ఉంటోంది. టీవీ సీరియళ్లు చూస్తూ అందులో వచ్చే సన్నివేశాలకు ప్రభావితమైంది. ఓ సన్నివేశంలో ఒంటరిగా ఉన్న మహిళకు మత్తు మందిచ్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని అపహరించడాన్ని ఒంట పట్టించుకుంది. దీంతో ఏకంగా ఆ ప్లాన్ అమల్లో పెట్టింది. ఒంటరిగా ఉన్న వృద్ద మహిళలకు మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతుండటమే కాకుండా బంగారు ఆభరణాల దుకాణాల్లో బంగారం కొంటున్నట్టు నటించి చోరీలకు పాల్పడుతోంది. ఇదే తరహాలో ఇటీవల టంగుటూరులో జరిగిన ఓ చోరీ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఎలీశమ్మపై అనుమానంతో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈమెపై Cr.No: 07/2025 u/s 328, 380, 448 IPC కింద టంగుటూరు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశాను. ఆమె నుంచి 35 లక్షల విలువైన 460 గ్రాముల బంగారు ఆభరణాలు, చోరీ కోసం వినియోగించుకునేందుకు సిద్దం చేసుకున్న నిద్ర మాత్రలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకాశంజిల్లా ఎస్పి దామోదర్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి