
ఏపీ అనకాపల్లి జిల్లా కసింకోట మండలం.. బయ్యవరం హైవేపై మంగళవారం ఉదయం ఒక్కసారిగా అలజడి మొదలైంది.. హైవే కల్వర్టు కింద ఓ బెడ్ షీట్ చుట్టి ఉంది. చుట్టూ కుక్కలు ఉన్నాయి.. ఈగలు కూడా తిష్టవేశాయి.. ఏం అర్ధకావడం లేదు.. రగ్గు.. మూటలాగా కట్టి ఉండటం చూసి.. అనుమానం వచ్చింది.. దీంతో ఏంటో చూద్దామని స్థానికులు అక్కడికి వెళ్లారు.. దగ్గరకు వెళ్లి చూసేసరికి దెబ్బకు షాకయ్యారు.. బెడ్ షీట్లో ఉన్నది మృతదేహంగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది.. మహిళకు చెందిన సగం మృతదేహంగా పోలీసులు గుర్తించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి.. ఆపై ఆమె సగం శరీర భాగాలు తీసుకువచ్చి పడేసినట్టు గుర్తించారు. మృతదేహంలో.. నడుము నుంచి కాళ్ళ వరకు భాగాలున్నాయి.. దీంతో పాటు ఓ చేయి ఉంది. రగ్గు లాంటి బెడ్ షీట్లో.. సగం మృతదేహాన్ని చుట్టి.. తీసుకొచ్చి కల్వర్టులో పడేశారు గుర్తుతెలియని దుండగులు.
సమాచారం అందుకున్న అనకాపల్లి డిఎస్పి శ్రావణి ఘటన స్థలిని పరిశీలించి.. పలు వివరాలు సేకరించారు. క్లూస్ టీం కూడా రంగంలోకి దిగింది. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గుర్తుతెలియని ఆ మహిళ ఎవరై ఉంటుంది..? ఎవరు హత్య చేసి ఉంటారు.. అనేదానిపై పోలీసులు కూపి లాగుతున్నారు.
వీడియో చూడండి..
ఈ ఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.. మిస్సింగ్ మహిళ వివరాలు కూడా ఆరాతీస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..