
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులపై గ్రామ బహిష్కరణ విధిస్తూ అగ్రవర్ణాల కుల పెద్దలు హుకుం జారీ చేశారు. గ్రామంలో ఉన్న షాపులు, హోటళ్లలో ఏ విధమైన వస్తువులను దళితులకు విక్రయించొద్దని ఆదేశించడం కలకలం రేపుతోంది. ఈనెల 16న గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి దగ్గర కరెంటు పని చేస్తూ విద్యుత్ ఘాతానికి గురై పల్లపు సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. పల్లపు సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా సుమారు 2 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే తాము చేయని తప్పుకి నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాల పెద్దలు సమావేశమయ్యారు. దళితులను దూరం పెట్టాలని నిర్ణయించారు. వారికి ఏ విధమైన వస్తువులను విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు తీర్మానించాయి. ఆదేశాలు పాటించని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరించారు. దీంతో దళితులకు ఏ విధమైన వస్తువులను, తినుబండారాలను అమ్మకుండా షాపులు యజమానులు అమానుషంగా ప్రవర్తించారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మల్లం గ్రామంలో పర్యటించి… విచారణకు ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి