
టెక్నాలజీ యుగంలో మనిషి ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాడు. అంతరిక్షానికి సైతం రాకపోకలు సాగిస్తున్న ఆధునిక యుగంలోనూ మనుషులు మూఢవిశ్వాసాలు వీడటంలేదా అంటే… అవుననే అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే. ఓ వ్యక్తి తాను భూదేవి పుత్రుడిని.. తరచూ భూమాత తన ఒంట్లోకి వస్తుందని, తను భూగర్భంలోకి వెళ్లిపోతానంటూ సజీవ సమాధికి సిద్ధమయ్యాడు. విషయం పోలీసులకు తెలియడంతో సకాలంలో అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి దీక్షను భగ్నం చేయడంతో బతికి బయటపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కైపు కోటిరెడ్డి కొన్నేళ్ల క్రితం ఊరి చివరలోని తన పొలంలో భూదేవి అమ్మవారి ఆలయం నిర్మించాడు. అక్కడ నిత్య పూజలు చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆలయ సమీపంలో ఆరడుగుల గొయ్యి తవ్వి అందులోకి వెళ్లి రోజూ ధ్యానం చేస్తున్నాడు. అంతేకాదు ఉగాది రోజు తను జీవసమాధి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున కుమారుడిని వెంటపెట్టుకొని ఆలయం వద్దకు చేరుకున్నాడు. తాను జీవసమాధి అవుతానని, అందుకు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గొయ్యిని కుమారుడికి చూపించి, తాను గొయ్యిలోపలికి వెళ్లి ధ్యానం చేసుకుంటానని, ఇనుప రేకును ఉంచి, దానిపై మట్టితో పూడ్చి వేయమని కుమారుడికి చెప్పి, గొయ్యిలో నగ్నంగా కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు. తండ్రి చెప్పినట్టుగా కుమారుడు సమాధి చేశాడు. కోటిరెడ్డి జీవసమాధి అవుతున్నాడన్న విషయం తెలుసుకొని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తక్షణం అక్కడికి చేరుకున్న పోలీసులు కోటిరెడ్డి దీక్షను భగ్నం చేసి ప్రాణాలతో బయటకు తీశారు. తాను ప్రపంచశాంతి కోసం దీక్ష చేస్తున్నానని కోటి రెడ్డి చెబుతున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..