
హైదరాబాద్, ఏప్రిల్ 24: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులోకి వచ్చాయి. జేఈఈ మెయిన్ 2025 రెండు విడతల్లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2, 2025వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పరీక్ష కూడా ఇదే నెలలో ప్రారంభం కానుంది. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలు రూ.1600, ఇతరులు రూ.3,200 చొప్పున ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మే 11వ తేదీ నుంచి 18 వరకు అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షను మే 18వ తేదీన నిర్వహించనున్నారు. పేపర్ 1 పరీక్ష ఉదయం 9గంటల నుంచి మద్యాహ్నాం 12 గంటల వరకు, పేపర్ 2 మద్యాహ్నాం 2:30 నుంచి 5:30 గంటల వరకు జరగుతుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా జేఈఈ మెయిన్లో దేశవ్యాప్తంగా 2,50,236 మంది కనీస కటాఫ్ పర్సంటైల్ స్కోర్ సాధించి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు. జేఈఈ మెయిన్ ఫలితాలను ఎన్టీఏ ఏప్రిల్ 18 అర్ధరాత్రి వెల్లడించింది. మెయిన్కు రెండు విడతల్లో ఉమ్మడిగా దేశ వ్యాప్తంగా 15.39 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 14.75 లక్షల మందే పరీక్షలు రాశారు. చివరకు 2.50 లక్షల మంది కనీస మార్కులు పొందారు. వీరంతా దేశంలోని ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ (జీఎఫ్టీఐ)ల్లో సీట్లు పొందేందుకు పోటీపడొచ్చు. అయితే ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే అడ్వాన్స్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత పొందిర వారికి సీట్లు కేటాయిస్తారు. అడ్వాన్స్డ్ ఫలితాలను జూన్ 2న వెల్లడిస్తారు.
ఇవి కూడా చదవండి
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మరికొన్ని సీట్లు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్ 5న ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.