

గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా గంభీరంగా ఉంటుంది. అదే రీతిలో భారత్ రియాక్షన్ కనిపిస్తోంది. పహల్గామ్ అటాక్ తర్వాత మన రివేంజ్ ఏ రేంజ్లో ఉంటుందో పాకిస్తాన్ ఊహలకే వదిలేస్తున్నాం అంటున్నారు కేంద్ర పెద్దలు. దెబ్బకు దెబ్బ తప్పదని వార్నింగ్ ఇచ్చారు రక్షణశాఖామంత్రి. ఇది కేవలం ప్రతీకారమే కాదు.. పాక్కు అష్టదిగ్బంధనం అంటే ఏంటో రుచి చూపించబోతున్నారు. ఇప్పటికిపుడు ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రం మిస్రీ ప్రకటన చేశారు.
ఒకటి సింధు జలాల ఒప్పందం నిలుపుదల. రెండు అటారీ బోర్డర్ మూసేసి.. సరైన ధ్రువపత్రాలతో భారత్కు వచ్చినవాళ్లు మే 1లోపు తిరిగి వెళ్లిపోవాలని ఆదేశం. మూడోది సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థాన్ జాతీయులకు భారత్లోకి ప్రవేశం నిషేధం. దీని కింద గతంలో ఇచ్చిన వీసాలూ రద్దు. ఈ వీసా కింద ఇప్పటికే భారత్లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో స్వదేశానికి వెళ్లిపోవాలని అల్టిమేటం. నాలుగు భారత్లోని పాక్ హైకమిషన్లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశం. ఇదే సమయంలో భారత్ సైతం ఇస్లామాబాద్లో ఉన్న త్రివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటుందని వెల్లడి. చివరిది ఇరు వైపులా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి కుదించాలని నిర్ణయం. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టీకరణ. ఈ ఐదు కీలక నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందం రద్దే ముఖ్యమైనది. దీని వల్ల పాకిస్తాన్కు తీవ్ర ఇబ్బందులు తప్పవు. పాక్ పంటల సాగుకు నీరు అందకపోవచ్చు. కరువులు పెరిగిపోవచ్చు. అంతేకాదు పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 45శాతం మంది ఉద్యోగాలు ఈ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. 39బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు పాకిస్తాన్ కోల్పోయే అవకాశాలున్నాయి. అయితే ఇవి కేవలం ప్రతీకారంలో తొలి అడుగులు మాత్రమే. భారత్ ఇప్పటివరకు ఆంక్షలు, నిషేధాలే విధించింది. ఇకపై గేరు మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కశ్మీర్ను జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. 12మంది అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. ప్రపంచం ఆశ్చర్యపోయే సమాధానం ఇస్తామన్న రాజ్నాథ్.. ఏ ఒక్కరినీ వదిలేది లేదని లేదని ఘాటుగా చెప్పారు.
ఈ ప్రతీకారం ఎలా ఉండబోతోంది? 2016లో ఉరి టెర్రర్ ఎటాక్కు ప్రతీకారంగా.. అదే ఏడాది సెప్టెంబర్ 28 అర్ధరాత్రి సర్జికల్ స్ట్రైక్స్తో విరుచుకుపడింది భారత్. ఇక 2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత కూడా భారత్ ఘాటుగానే ప్రతీకార దాడులకు దిగింది. మిరాజ్ 2000 జెట్స్తో బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్ చేసింది. ఆ సమయంలో చాలామంది పాక్ సైనికులను మట్టుబెట్టింది మన ఆర్మీ. ఇప్పుడు అంతకు మించిన దాడులు ఉండబోతున్నాయా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది.