

అర్కియోలజీ.. ఇదెప్పుడూ ఓ ఆసక్తికరమైన సబ్జెక్ట్.. మన దేశంలోని ఎందరో పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు.. ఎలప్పుడూ ఏదొక చోట.. చరిత్ర ఆనవాళ్లు బయటకు తీస్తుంటారు. పురాతన కట్టడాలు, ఆలయాలు, నిధి నిక్షేపాలు, సొరంగాలు.. ఇలా ఎన్నింటినో వెలికి తీస్తుంటారు. అయితే ఈ పరిశోధనలు ఒక్క మన ఇండియాలోనే కాదు.. దేశవిదేశాల్లో కూడా ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్తలు ఎలప్పుడూ ఏదొక చరిత్ర ఆనవాళ్లను వెలికితీస్తారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే.. ఇందులో ఇద్దరు యువ పరిశోధకులు.. లైఫ్టైం పురాతన నిధిని కనిపెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. స్కాట్ల్యాండ్కు చెందిన కీత్ యంగ్, లిసా స్టీఫెన్సన్ అనే ఇద్దరు యువ పరిశోధకులు 15వ శతాబ్దపు నాటి నాణేల నిధిని వెలికితీశారు. ఈ నిధిని వారు స్కాట్ల్యాండ్, ఇంగ్లాండ్ బోర్డర్లో కనుగొనడం విశేషం. ఎందరో పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు వారి ఆవిష్కరణను’జీవితకాలపు అన్వేషణ’గా ప్రశంసించారు.
1400 కాలం నాటి స్కాటిష్, ఇంగ్లాండ్ కరెన్సీకి చెందిన 30కి పైగా బంగారం, వెండి నాణేలను వారు వెలికితీశారు. అనేక మంది చక్రవర్తుల పాలనలో ముద్రించబడిన ఈ నాణేలు ఆ కాలపు ఆర్థిక, రాజకీయ దృశ్యాలను కళ్ల ముందుకు తీసుకొచ్చాయి. ఈ నాణేలలో హెన్రీ V, ఎడ్వర్డ్ IV చక్రవర్తుల కాలం నాటి వెండి నాణేలు. అలాగే జేమ్స్ I, జేమ్స్ II పాలన సమయంలో ముద్రించిన స్కాటిష్ బంగారు డెమీ, హాఫ్-డెమీ నాణేలు ఉన్నాయి. వీటన్నింటిని చాలా అరుదైన సంపదగా భావిస్తున్నారు చరిత్రకారులు.
తవ్వకాల్లో లచ్చిందేవి తలుపు తట్టింది..
కీత్ యంగ్, లిసా స్టీఫెన్సన్ మొదట నాణేలను వెలికితీసినప్పుడు.. అనూహ్యంగా వారికి ఏదో అద్భుతాన్ని కనుగొన్నామని అర్ధమైంది. వారిద్దరూ చరిత్రకు సంబంధించిన అరుదైన సంపదను కనుగొన్నారు. అలాగే ఈ జంట దీన్ని అధికారికంగా ప్రభుత్వానికి వివరించడంలోనూ ఎక్కడా తప్పుదోవ పట్టించలేదని స్కాట్లాండ్ ట్రెజర్ ట్రోవ్ యూనిట్ హెడ్ ఆంటోనీ లీ తెలిపారు. ఇక పురాతన శాస్త్రవేత్తలు వీరు తవ్వకాలు జరిపిన స్థలానికి వెళ్లి.. మరింత లోతుగా పరిశోధనలు చేయగా.. మరో ఐదు అరుదైన నాణేలు దొరికాయి. దానితో లెక్క 35కు చేరుకుంది.