
విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టేందుకు ఓ గురు వినూత్న ఆలోచన చేశారు.. విద్యార్థులు చేసిన తప్పును తన తప్పుగా భావించి.. తనకు తాను శిక్ష వేసుకున్నారు. ఎంత చెప్పినా అల్లరి తగ్గించడం లేదని ఓ స్కూల్ హెడ్మాస్టర్ గుంజీలు తీశాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం, పెంట జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్.. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపర్చి వారితో స్టేజిపై నుంచి మాట్లాడారు. విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీశారు.
ఆపై తాము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము, మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తేనైనా విద్యార్థులు అల్లరి మాని బాగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో.. హెడ్మాస్టార్ ఇలా చేశారని స్కూల్లో టీచర్లు చెబుతున్నారు.
పూర్వం పాఠశాలలో విద్యార్థులు అల్లరి చేయాలంటే వణికిపోయేవారు. మాస్టారు అక్కడి నుంచి వస్తున్నారంటే ఇక్కడి నుంచే జారుకునేవారు. విద్యార్థులను దండించినా పేరెంట్స్ బాధపడేవారు కాదు. పైగా ఇంకా ఎక్కువ దండించి దారిలో పెట్టమనేవారు. టీచర్ భయంతోనైనా పిల్లవాడి ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆశపడేవారడు. కానీ ఇప్పుడు కాలంతో పాటు పాఠశాల విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. బెత్తెం ఎత్తితే చాలు.. పేరెంట్స్ గొడవకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లరి చేసే విద్యార్థుల చేత గుంజీలు తీయించాల్సిన ఉపాధ్యాయులే తమకు తాము శిక్షలు వేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని స్థానికులంటున్నారు.
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని….విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ!… pic.twitter.com/Se7zu6uwf5
— Lokesh Nara (@naralokesh) March 13, 2025
హెడ్మాస్టర్ వినూత్న ఆలోచనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. X వేదికగా హెడ్ మాస్టర్ను అభినందించారు. “విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని….విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది, అభినందనలు. అందరం కలిసి విద్యాప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.