
ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో భారత్ దూసుకుపోతుంది. అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ను టీం ఇండియా ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం రోజు న్యూజిలాండ్తో టీమ్ ఇండియా తలపడబోతోంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు సినిమా థియేటర్లు ఆశ చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని పలు థియేటర్లలో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
హైదరాబాద్లోని పీవీఆర్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లలో మ్యాచులకు సంబంధించిన టికెట్లను విక్రయిస్తున్నారు. సాధారణ సినిమా టికెట్ ధరల రీతిలోనే మ్యాచ్కు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ టికెట్లను సైతం విక్రయిస్తున్నారు. ఉదాహరణకు గతంలో సినిమా టికెట్ 295 రూపాయలు ఉంటే మ్యాచ్ వీక్షకులకు సైతం అదే రేటుకు టికెట్లను విక్రయిస్తున్నారు. దీంతో ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూసే బదులు థియేటర్కి వెళ్లి మ్యాచ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా మారింది.
హైదరాబాద్తో పాటు దేశంలో ఉన్న అన్ని పీవీఆర్ మల్టీప్లెక్స్లలోనూ ఇదే రీతిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పీవీఆర్ యాజమాన్యం నిర్ణయించుకుంది. దీంట్లో భాగంగా అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న పీవీఆర్ మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా మ్యాచ్లను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. గతంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లోనూ ఇదే రీతిలో స్ట్రీమింగ్ చేయాలనుకున్నప్పటికీ న్యూజిలాండ్తో మ్యాచ్ నుంచి ఈ తరహా స్ట్రీమింగ్ను చేస్తున్నారు.
మరోవైపు గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే ఇండియాతో పాటు న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరాయి. ఆతిధ్య పాకిస్తాన్ జట్టు ఒక గెలుపు కూడా రుచి చూడకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్-బీలో ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్కు చేరగా, మరో బెర్త్ కోసం సౌత్ ఆఫ్రికాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతున్నాయి. గ్రూప్-ఏలో చివరి లీగ్ మ్యాచ్ ఆదివారం రోజు భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.